– ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
– లాండ్రి షాపులో ఇస్త్రీ చేస్తు చేయి గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఉట్నూర్
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నేరవేరుస్తామని, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం మండలంలోని లక్కారాం గ్రామంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓ లాండ్రి షాప్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బట్టలను ఇస్త్రీ చేసి హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అదే విధంగా ఓ అవ్వతో ముచ్చటిస్తు గుబులు పడకు త్వరలో రూ.4 వేల ఫించన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలల్లోనే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10లక్షల ప్రమాద భీమా, రూ.500లకు గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి గొప్ప ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం వృద్ధులకు, అంగవైకల్యం చెందిన వారికీ, వితంతువులకు, రూ.4 వేల ఫించన్ అందిస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ అవలంబిస్తున్న తీరును ఖండిస్తున్నామన్నారు. ఈ దేశానికి రాహుల్గాంధీ నాయకత్వం ఎంతో అవసరమని, ఆయనను ప్రధానిని చేయడమే మన లక్ష్యం కావాలన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు పాల్గొన్నారు.