ట్రాక్టర్ బోల్తా.. మహిళ మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : ట్రాక్టర్ బోల్తా పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం మంగంపేట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అంజిలమ్మ అనే మహిళ మృతిచెందగా .. ఇద్దరికి గాయాలయ్యాయి. అంజిలమ్మ పైన ట్రాక్టర్ పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు గాయపడటంతో అంబులెన్స్ లో మహబూబ్ నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన అంజిలమ్మ మృతదేహాన్ని జేసీబీ సాయంతో ట్రాక్టర్ ను పైకి లేపి బయటకు తీసి అంజిలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హన్వాడ మండలం వేపూర్ గ్రామానికి చెందిన గొల్ల అంజిలమ్మ (60) మంగంపేట లోని కూతురి ఇంటికి వచ్చి వెళ్తుండగా ఘటన జరిగింది. గొల్ల అంజిలమ్మ, కృష్ణవేణి మరియు తన ఇద్దరి మనవరాలు మంగంపేట నుండి ముకర్లబాద్ నడుచుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యలో అనుముని శీను అనే వ్యక్తి తన ట్రాక్టర్ పైన వస్తుండగా ట్రాక్టర్ ను ఆపి ముకర్లబాద్ దగ్గర దించమని అడిగారు. ట్రాక్టర్ ఎక్కించుకొని ముకర్లాబాద్ వైపుగా వస్తుండగా మార్గ మధ్యలో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలంలో బోల్తా పడగా ట్రాక్టర్ పైన ఉన్నటువంటి అంజిలమ్మ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారికి గాయాలయ్యాయి. మృతురాలు అంజిలమ్మ కొడుకు మల్లేష్ ఇచ్చిన దరఖాస్తు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణం ట్రాక్టర్ అతి వేగంగా వెళ్లడమే కారణం కావచ్చని వారు తెలిపారు.

Spread the love