ఎల్జీ తీరుకు నిరసనగా కేజ్రీవాల్‌, ఎమ్మెల్యేల ర్యాలీ

న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ)జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ సోమవారం ప్రదర్శన చేపట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆధ్వర్యాన ఆప్‌ ఎమ్మెల్యేలు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె. సక్సేనా కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఢిల్లీ పాఠశాల ఉపాధ్యాయు లను శిక్షణ కోసం ఫిన్‌లాండ్‌కు పంపే ప్రతిపాదనను ఎల్జీ కార్యాలయం తిర స్కరించడంపై ఆప్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఢిల్లీ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం. ఢిల్లీ ప్రజలు పన్నుల రూపేణా చెల్లించిన నగదును, విద్య కోసం ఖర్చు చేస్తున్నామని, దీనివల్ల ఎల్జీకి వచ్చిన సమస్య ఏమిటని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఢిల్లీ సీఎం, ఎమ్మెల్యేలు ఎల్జీ కార్యాలయానికి ర్యాలీ చేపట్టాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. ఎల్జీ తన తప్పు తెలుసుకుని, ఉపాధ్యాయులను ఫిన్‌లాండ్‌కు అనుమతిస్తారని ఆశిస్తున్నానని కేజ్రీవాల్‌ మీడియాతో అన్నారు. 2018 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ.. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేరని అన్నారు.

Spread the love