గుంట భూమీ వదిలిపెట్టం

– మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేయకుంటే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం
– కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
– భూములు పోతున్నాయని ఆందోళనలు
– తెల్లవారు జామునుంచే ముందస్తు అరెస్టులు
నవతెలంగాణ-కామారెడ్డి టౌన్‌
మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, నేడు కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా ప్రతిపాదనను రద్దు చేస్తున్నట్టు తీర్మానించాలని రైతులు డిమాండ్‌ చేశారు. లేకపోతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని, ఇకపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రాణం పోయినా గుంట భూమి కూడా వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కాగా ధర్నాలో పాల్గొనకుండా పలువురు రైతులను పోలీసులు తెల్లవారుజాము నుంచే ముందస్తుగా అరెస్టు చేశారు. ముందే అనుమతి తీసుకున్నా అరెస్టులు చేయడం పట్ల పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నా సమాయనికి ముందే మున్సిపల్‌ కార్యాలయం వద్ద పోలీసులు భారీ స్థాయిలో చేరుకున్నారు. ర్యాపిడ్‌ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. కార్యాలయ గేటును మూసివేశారు. మున్సిపల్‌ సిబ్బంది, మాస్టర్‌ ప్లాన్‌పై అభ్యంతరాలు తెలిపే రైతులు, ఇతర ఎమర్జెన్సీ పనులు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. అల్లర్లు జరిగితే అరెస్ట్‌ చేయడానికి సిద్ధమయ్యారు. అందుబాటులో రెండు డీసీఎం వ్యానులనూ ఉంచారు. ఇటీవల కలెక్టరేట్‌ వద్ద జరిగిన ఘటనలు జరగకుండా ఉండేందుకు పక్కాగా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే రైతులు శాంతియుతంగా నిరసన చేపట్టి అనుకున్న సమయానికి విరమించారు. ధర్నాలో అడ్లూర్‌ ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్‌ నాయకులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..
తాము చేసే ఉద్యమం తమ పిల్లల భవిష్యత్తు కోసమేనన్నారు. ఉన్న భూమిని కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందన్న ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయడం కోసమేనని తెలిపారు. తమకు జీవనాధారంగా ఉన్న భూమిని కాపాడుకోవడం కోసమే పోరాటం చేస్తున్నామే కాని రాజకీయంగా తమకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. తమకు మద్దతు తెలిపి మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేయాల్సిన నాయకులు భిన్న ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యమానికి మద్దతివ్వాల్సింది పోయి పెయిడ్‌ వర్కర్లు అంటూ హేళన చేసి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రైతులం కాదా.. తమ వద్ద ఓట్లు అడుక్కోలేదా అని నిలదీశారు. న్యాయం కోసం రోడ్డెక్కితే పెయిడ్‌ వర్కర్లుగా కనిపిస్తున్నమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకరేమో పెయిడ్‌ వర్కర్లు అంటారు. మరొకరేమో ఇది మున్సిపల్‌ చేసిన తీర్మానం కాదని, అధికారులు, కన్సల్టెన్సీ వాళ్ళ తప్పిదమంటారు. తప్పిదమని రైతులు రోడ్డెక్కిన నెల రోజులకు గుర్తించారా అని ప్రశ్నించారు. మీ తప్పిదం లేకపోతే.. వాళ్లదే తప్పిదం అయితే ఇన్నాళ్లుఎందుకు ఊరుకున్నారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మొదటి రోజే మున్సిపల్‌ ముట్టడి సమయంలో ఈ విషయం చెప్పి ముసాయిదా డ్రాఫ్ట్‌ను మారుస్తామని, ఇండిస్టియల్‌ జోన్‌ను ప్రభుత్వ భూముల్లోకి మళ్లిస్తామని ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పటికైనా మీ మాట నిలుపుకోవాలని, మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్‌లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధిత రైతులు పాల్గొన్నారు.

Spread the love