మూగబోయిన సుమధురవాణి

           పాటలోని భావం ఏదైనా సరే ఆమె గొంతులోనుంచి జాలువారితే చాలు.. ఎంతో శ్రావ్యంగా ఉంటుంది. ఎన్నో అణిముత్యాల్లాంటి పాటలతో సంగీత ప్రియులను అలరించిన అగ్ర గాయనిమణి వాణీజయరాం. అసలు సినిమాల్లో పాడాతానా లేదా అనే మీమాంసలో ఉన్న ఆమె ఏకంగా 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడటం విశేషం. ఎందుకంటే వారి ఇంట్లో శాస్త్రీయ సంగీతం తప్ప మరొకటి వినిపించడానికి వీల్లేదు. కనీసం లలిత గీతాలు కూడా పాడనిచ్చేవారు కాదు. ఇక సినిమాలన్నా, సినిమా పాటలన్నా సంపూర్ణ నిషేధం. సినీ గీతాలు విన్నా, పాడినా శాస్త్రీయ సంగీతానికి అవమానం జరిగినట్టు భావించేవారు. ఇలాంటి పరిస్థితుల్లో సినీ గీతాలపై ఆసక్తి పెంచుకున్న వాణీజయరాం ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రపంచంలో అగ్రగాయనిగా రాణించటం మామూలు విషయం కాదు. రాబోయే తరాల మదిలోనూ తన సుమధుర గానామృతంతో సజీవంగా నిలిచి ఉండే వాణీజయరాం సినీ గీత ప్రస్థానంలోని కొన్ని విశేషాలు..

సంగీత నేపథ్య కుటుంబం
           వాణీజయరాం (అసలు పేరు కలైవాణి). తమిళనాడులోని వేలూరులో 1945 నవంబర్‌ 30న పుట్టారు. అమ్మ పద్మావతి. నాన్న దొరైస్వామి. అమ్మ పద్మావతి చక్కగా పాడటమే కాకుండా వీణ కూడా వాయించేవారు. పదకొండు మంది పిల్లల్లో వాణిజయరాం ఎనిమిదో సంతానం. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. కడలూరు శ్రీనివాస అయ్యంగార్‌ అనే విద్వాంసుని దగ్గర సంగీతం నేర్చుకున్నారు. తర్వాత టి.ఆర్‌.బాలసుబ్రమణియన్‌, త్రివేండ్రం ఆర్‌.ఎస్‌.మణి వంటి సంగీతజ్ఞుల దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు.
ఆల్‌ ఇండియా రేడియోలో తొలిపాట
           పదేళ్ళ వయసులో స్కూల్‌ తరఫున ఆల్‌ ఇండియా రేడియోలో పాటలు పాడే అవకాశం వచ్చింది. అలా తొలిసారి ఆమె గొంతు బాహ్య ప్రపంచానికి వినిపించింది. అక్కడ్నుంచి తరచూ వివిధ రేడియో కార్యక్రమాల్లో పాటలు పాడారు. ఇంట్లో శాస్త్రీయ సంగీతం తప్ప మరొకటి వినిపించడానికి వీల్లేదు. ఇక సినిమాలన్నా సినిమా పాటలన్నా సంపూర్ణ నిషేధం. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు సినీ గీతాలపై ఆసక్తి పెరిగింది. ఇంట్లో ఉన్న రేడియోలో వివిధ భారతి ప్రోగ్రామ్‌లో వచ్చే సినిమా పాటలను దొంగచాటుగా వినేవారు. విన్న పాటల్ని నేపథ్య సంగీతంతో సహా కంఠతా పెట్టేవారు. అంతేకాదు ఎప్పటికైనా సినిమాల్లో పాడాలి అనే ధృడ నిర్ణయానికీ వచ్చారు. స్కూల్‌ అయ్యాక చెెన్నైలోని క్వీన్స్‌మేరీ కాలేజీలో జాయిన్‌ అయ్యారు. ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. తర్వాత స్టేట్‌ బ్యాంక్‌ ఇండియాలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌కి షిప్ట్‌ అయ్యారు. ముంబాయి ఇండో బెల్జియం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీగా పని చేస్తున్న జయరాంతో వివాహం జరిగింది. దీంతో భర్తతో పాటు ముంబాయికి వచ్చారు. ముంబాయికి రావడమే ఆమె జీవితంలో ఊహించని మలుపు అయ్యింది.
భర్త ప్రోత్సాహంతో
           భర్తకి కూడా సంగీతం అంటే అభిమానం. పండిట్‌ రవిశంకర్‌ దగ్గర ఆరేళ్లపాటు ఆయన సితార్‌ నేర్చుకున్నారు. కర్నాటిక్‌, శాస్త్రీయం నేర్చుకున్న వాణిని హిందుస్థానీ కూడా నేర్చుకో అని ప్రోత్సహించారు. దీంతో ఉస్తాద్‌ అబ్దుల్‌ రహమాన్‌ సాబ్‌ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నారు. దాదాపు ఆరు నెలల కఠిన శిక్షణ తరువాత గురువు ఉస్తాద్‌ అబ్దుల్‌ ఇచ్చిన సలహా మేరకు ఉద్యోగం మానేసి పూర్తి సమయాన్ని సంగీతానికి కేటాయించారు. 1969లో ముంబాయిలో తొలి కచేరి ఇచ్చారు. ఈ కచేరీలో మంచి పేరు రావడంతో వరుస కచేరీలకు ఆఫర్లు వచ్చాయి. అలా ఓ కచేరీకి ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు వసంత్‌దేశారు వచ్చారు. ఆయనకు వాణి గొంతు బాగా నచ్చటంతో గుల్జార్‌కి సిఫారసు చేశారు. అప్పుడు ఆమెతో గుల్జార్‌ ‘మీరాభజన్స్‌’ పాడించారు. ఇది ఆమె తొలి రికార్డింగ్‌.
తొలిపాటకే ఐదు అవార్డులు..
           1970లో హృశికేష్‌ ముఖర్జీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుడ్డీ’ చిత్రంలో పాటలు పాడే అవకాశం వచ్చింది. వసంత్‌ దేశారు సంగీత ఆధ్వర్యంలో వాణీ మూడు పాటలు పాడారు. వీటిల్లో ధరేంద్ర, జయబాధురీ జంటపై చిత్రీకరించిన ‘బోలే రే పపి..’ పాట అప్పట్లో సూపర్‌హిట్‌ అయింది. దానికి తాన్‌సేన్‌ అవార్డుతోపాటు మరో నాలుగు అవార్డులు వచ్చాయి. మొదటి పాటకే వాణీ మంచి గాయనిగా గుర్తింపు పొందారు. అంతేకాదు సినిమాల్లో పాడాలనే కల కూడా నేరవేరింది. 1972లో మరో ప్రముఖ సంగీత దర్శకుడు నౌషద్‌ నేతృత్వంలో ‘పాకీజా’ సినిమాలో పాడిన పాటలన్ని హిట్‌ కావడంతో సినిమా అవకాశాలు ఓ వెల్లువలా వచ్చాయి. దీంతో ఆర్‌.డి.బర్మన్‌, నౌషద్‌, మదన్‌మోహన్‌, ఓపీ నయ్యర్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌, పండిట్‌ రవిశంకర్‌ వంటి తదితర హేమాహేమీ సంగీత దర్శకులతో పని చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అలాగే మహ్మద్‌ రఫీ, కిషోర్‌కుమార్‌ వంటి అగ్ర నేపథ్య గాయకులతోనూ కలిసి పాడే అవకాశాన్ని దక్కించుకున్నారు. గాయనిగా బాలీవుడ్‌లో ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
తెలుగులోనూ ప్రత్యేకతను చాటుకున్నారు
           అగ్ర సంగీత దర్శకుడు ఎస్‌.పి.కోదండపాణి కోరిక మేరకు ‘అభిమానవంతుడు’ చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ అనే పాటను పాడారు. ఇదే వాణీకి తెలుగులో తొలి చిత్రం. తెలుగులో దిగ్గజ సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు, కె.చక్రవర్తి, ఎస్‌.రాజేశ్వరరావు, రాజన్‌ -నాగేంద్ర, విజయభాస్కర్‌, ఎం.ఎస్‌.విశ్వనాథన్‌, కె.వి.మహదేవన్‌, మాస్టర్‌ వేణు, జె.వి.రాఘవలు, ఇళయరాజా, సుసర్ల దక్షిణామూర్తి, కె.భాగ్యరాజా, ఏ.ఆర్‌.రెహ్మాన్‌ తదితరులు సంగీత నేతృత్వం వహించిన దీక్ష, పూజ, మరో చరిత్ర, గుప్పెడు మనసు, సర్కస్‌ రాముడు, మా ఇంటి దేవత, శంకరాభరణం, శివమెత్తిన సత్యం, సీతాకోక చిలుక, మంగమ్మగారి మనవుడు, సంకీర్తన, శృతిలయలు, నేనూ మీవాడినే, స్వర్ణకమలం, ఘర్షణ, స్వాతికిరణం, ప్రేమాలయం వంటి తదితర ఎన్నో తెలుగు సినిమాల్లో వేల పాటలు పాడి అలరించారు.
19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు
           తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠి, గుజరాతీ, అస్సామీ, తులు, బెంగాలీ, భోజ్‌పురి, ఇలా దాదాపు 19 దేశీయ భాషల్లో 1000కి పైగా చిత్రాల్లో 10 వేలకి పైగా భిన్న పాటలు పాడారు. అలాగే 10వేలకు పైగా ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ కోసం భక్తి పాటలు, ఇతర పాటలను ఆలపించారు. కె.బాలచందర్‌ ‘అపూర్వ రాగంళ్‌’ (1975), కె.విశ్వనాథ్‌, ‘శంకరాభరణం’ (1980)లోని ‘మానస సంచారే..’ పాటకు, కె.విశ్వనాథ్‌ ‘స్వాతికిరణం’ (1991) చిత్రంలోని ‘ఆనతి నియ్యరా హరా..’పాటకు జాతీయ ఉత్తమగాయనిగా పురస్కారాలను దక్కించుకున్నారు. ‘శంకరాభరణం’ చిత్రానికి ఉత్తమ గాయనిగా నంది అవార్డు పొందారు. అలాగే తమిళం, గుజరాత్‌, ఒడిస్సా రాష్ట్ర అవార్డులను సైతం ఉత్తమగాయనిగా సొంతం చేసుకున్నారు. వీటితోపాటు ఎన్నో ఫిల్మ్‌ ఫేర్‌ పురస్కారాలనూ దక్కించుకున్నారు. ఐదు దశాబ్దాలుగా సంగీత రంగంలో ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. వేల పాటలతో ఆబాలగోపాలాన్ని అలరించిన వాణీజయరాం మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు.

సూపర్‌హిట్‌ తెలుగు సాంగ్స్‌
‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’, ‘పూజ చేయ..’, ‘విధి చేయు వింతలన్ని..’, ‘కన్నె వలపు.. కన్నె పిలుపు..’, ‘బ్రోచేవారెవరురా..’, ‘దొరకునా ఇటు వంటి సేవా..’, ‘మానస సంచారే..’, ‘పలుకే బంగారమాయెనే’, ‘ఏ తీరుగా నిను..’, ‘మిన్నేటి సూర్యుడు వచ్చాడమ్మా..’, ‘సాగర సంగమమే..’, ‘అలలు..కలలు..’, ‘ఇన్ని రాశుల యునికి..’, ‘అందెల రవళి..’, ‘ఒక బృందావనం..సోయగం..’, ‘తెలిమంచు కురిసింది..’, ‘ప్రణతి..ప్రణతి..’, ‘శృతి నీవు. వంటి ఎన్నో తెలుగు పాటలు సంగీత ప్రియుల మనసుల్ని దోచాయి.

Spread the love