– అమాయక విద్యార్థులను మోసం చేస్తున్నారంటూ యూజీసీ లేఖలు
న్యూఢిల్లీ : దేశంలో 20 నకిలీ విశ్వవిద్యాల యాలు నడుస్తున్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. వీటిలో అత్యధిక వర్సిటీలు దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్నా యని వివరించింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బూటకపు యూనివర్సిటీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ మేరకు ఆయా యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లకు యూజీసీ ఓ లేఖ రాసింది. 1956వ సంవత్సరపు యూజీసీ చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్) లేదా సెక్షన్ 3 ప్రకారం వాటిని యూనివర్సి టీలుగా పరిగణించలేమని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ సంస్థలు యూనివర్సిటీ పేరిట చలామణి అవుతూ అమాయకులైన విద్యార్థులను మోసం చేసి, డిగ్రీలు ఇస్తున్నాయని తెలిపింది. ‘మీ మోసపూరిత చర్య కారణంగా అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడడం ఆందోళన కలిగిస్తోంది’ అని ఆ లేఖలో నకిలీ యూనివర్సిటీలను తూర్పార పట్టింది.
నకిలీ వర్సిటీలలో ఎనిమిది రాజధాని ఢిల్లీలోనే ఉన్నాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీ (అలీపూర్), కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్ (దర్యాగంజ్), యునైటెడ్ నేషన్స్ యూని వర్సిటీ, ఒకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్-సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, రోహిణిలోని ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ సంస్థలు దేశ రాజధానిలోనే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
నకిలీ యూనివర్సిటీల జాబితాలో క్రైస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్సిటీ (గుంటూరు), బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా (విశాఖపట్నం), బడగాన్వీ సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ (బెల్గాం), సెయింట్ జాన్స్ యూనివర్సిటీ (కిషనట్టం), రాజా అరబిక్ యూనివర్సిటీ (నాగపూర్), శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (పుదుచ్చేరి), గాంధీ హిందూ విద్యాపీఠ్ (అలహాబాద్), నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి (కాన్పూర్), నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (అలీఘర్), భారతీయ శిక్షా పరిషత్ (లక్నో), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రిసెర్చ్ (పశ్చిమ బెంగాల్) ఉన్నాయి.