జలప్రళయంతో 74 మంది మృతి.. భారీగా నష్టపోయిన హిమాచల్‌..

నవతెలంగాణ – హిమాచల్ ప్రదేశ్‌: ఉత్తర భారతదేశంలోని హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జులై నెలలో సంభవించిన భారీ వరద ఘటనను మరవకముందే మరోసారి ఆ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో కొండ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న భీకర వానతో ఆ రాష్ట్రం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ విపత్తు కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. గత వాగారం రోజులుగా హిమాచల్‌లో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో రాష్ట్రంలోని నదులు పొంగి ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహానికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 74 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర రాజధాని సిమ్లా లోని సమ్మర్‌ హిల్‌ ప్రాంతంలో సోమవారం భారీగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రుతుపవనాలు ప్రారంభమైన 55 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 113 కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. దీంతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కి రూ.2,491 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అదేవిధంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి రూ.1,000 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు సిమ్లాలోని సమ్మర్ హిల్‌ వద్ద ఉన్న సిమ్లా-కల్కా రైల్వే లైన్‌ డ్యామేజ్‌ అయ్యింది. క్లౌడ్‌బస్ట్‌ వల్ల భారీ వరద రావడంతో… రైల్వే ట్రాక్‌ కింద ఉన్న మట్టి ఊడ్చుకుపోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్‌ గాలికి వేలాడుతూ ఉంది. మరోవైపు ఈ విపత్తు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుక్కు తెలిపారు.

Spread the love