కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

నవతెలంగాణ – హిమాచల్‌ప్రదేశ్‌
హిమాచల్‌ప్రదేశ్‌లోని హహీర్పూర్‌ జిల్లాలో కలుషిత నీరు తాగడంతో 535 మంది అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని డజన్ల కొద్ది గ్రామాల్లో జల్‌ శక్తి శాఖ పంపిణీ చేస్తున్న మంచినీరు కలుషితమయింది. దీంతో ప్రతి ఇంట్లో ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. నీళ్లలో పెద్దమొత్తం బ్యాక్టీరియా ఉండటంతోనే ప్రజలు అనారోగ్యంపాలయ్యారని రంగ్‌గాస్‌ పంచాయతి హెడ్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న ట్యాంక్‌లో నిల్వ ఉంచిన నీటిని శుద్ధి చేయకుండానే పంపిణీ చేశారని ఆరోపించారు. కాగా, బాధితులంతా సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు సొంత నియోజకవర్గమైన నౌదాన్‌కు చెందినవారే కావడం విశేషం. ఈ ఘటనపై సీఎం స్పందించారు. బాధితుకు మెరుగైన వైద్య సాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. దీనిపై జిల్లా, రాష్ట్ర స్థాయి ఏజెన్సీలు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

Spread the love