Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్యాన్సర్పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి

క్యాన్సర్పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి

- Advertisement -

-నవంబర్ 7 నేషనల్ క్యాన్సర్ అవేర్ నెస్ డే సందర్భంగా క్యాన్సర్ స్పెషలిస్ట్, పితామహ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చైతన్య కుమార్ 
నవతెలంగాణ-కంఠేశ్వర్ 
శరీరంలోని ఏదైనా ఒక అవయవ భాగంలో కణజాలం అపరిమితంగా నియంత్రణ లేకుండా పెరగడం, ఇతర కణజాలాలకు వ్యాపించడం వల్ల ఆయా భాగాల్లో గడ్డలు లేదా పుండు ఏర్పడడాన్ని క్యాన్సర్ వ్యాధిగా పిలుస్తారు. ప్రాణాంతక క్యాన్సర్ కి సరైన చికిత్స లేదు అని అందరు అనుకుంటారు . కానీ, తొలిదశలోనే గుర్తించడం వల్ల తక్కువ చికిత్సతో క్యాన్సర్ ని పూర్తిగా నయం చేయవచ్చు. క్యాన్సర్ రాకుండా మన జీవన శైలి లో తగు జాగ్రత్తలు తీసుకోవడం, హెచ్ పి వి టీకాలు తీసుకోవడం మన చేతుల్లోనే ఉందని గమనించాలని క్యాన్సర్ స్పెషలిస్ట్, పితామహా క్యాన్సర్ కేర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చైతన్య కుమార్ అన్నారు.క్యాన్సర్ పట్ల పూర్తి అవగాహన, తీసుకోవలసిన జాగ్రత్తలు, చికిత్సా మార్గాలు, తొలిదశలో గుర్తించడంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ఈ అంశాలను చర్చించే వేదికగా ప్రతి ఏటా నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినం (నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే)ను 2014 నుంచి పాటించుట ఆనవాయితీగా మారింది. క్యా న్సర్ చికిత్సలో వినియోగపడే రేడియేషన్ థెరపీకి అవసరమైన రేడియం, పొలోనియం రేడియోధార్మిక మూలకాలను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత మేడమ్ క్యూరీ జన్మదినం సందర్భంగా నవంబర్ 7న క్యాన్సర్ అవగాహన దినంగా పాటిస్తున్నాం. వందకు పైగా క్యాన్సర్ రకాలుండగా వీటిలో రొమ్ము, నోటి, గర్భాశయ, ఊపిరితిత్తుల, జీర్ణక్రియ వ్యవస్త, ప్రోస్టేట్, బ్లడ్ క్యాన్సర్ ప్రధానమైనవి. క్యాన్సర్లలో కార్సినోమా (చర్మ, రొమ్ము, క్లోమ, ఇతర గ్రంథులకు), సర్కోమా (రక్తనాళాల, ఎముకల, కండరాల), మెలనోమా (చర్మ, పిగ్మెంట్), లింఫోమా (లింఫోసైట్స్), ల్యుకేమియా (రక్తం) అనబడే వర్గాలు ఉన్నాయి. క్యాన్సర్లలో పాంక్రియాటిక్ క్యాన్సర్ అతి ప్రమాదకరమైనదిగా గుర్తించబడింది. భారత్లో ప్రతి రోజు 1,300 మంది క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారు. మన దేశ పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్, మహిళల్లో రొమ్ము క్యాన్సర్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి.
క్యాన్సర్ లక్షణాలు, చికిత్సా మార్గాలు, జాగ్రత్తలు…….
క్యాన్సర్ వ్యాధికి ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించని కారణంగా తొలిదశలో గుర్తించడం కష్టం. క్యాన్సర్ రోగ లక్షణాలను పరిశీలిస్తే.. శరీరం లో కంతులు లేదా గడ్డలు, బరువు తగ్గడం , జ్వరం, దగ్గు, చర్మంపై మచ్చలు, ఉమ్మితే రక్తం పడడం, రక్తహీనత, రొమ్ములో గడ్డలు, మూత్ర సంబంధ మార్పులు, మలంలో రక్తం పడడం, బీజాల్లో గడ్డలు లాంటివి పేర్కొన్నారు. భారత్లో దాదాపు 50 శాతం క్యాన్సర్ కేసుల్లో రొమ్ము, గర్భాశయ, ఊపిరితిత్తుల, జీర్ణకోశ, పెద్ద పేగు క్యాన్సర్లు బయట పడుతున్నాయి. క్యాన్సర్ ప్రధాన చికిత్సల్లో క్యాన్సర్ శాస్త్ర చికిత్స , ఇమ్యునోథెరపీ, రేడియోషన్ థెరపీ, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, స్టెమ్ సెల్ మార్పిడి, లాంటివి బహుళ ప్రచారంలో ఉన్నాయి. శరీర బరువు నియంత్రణ, పోషకాహారం, శారీరక శ్రమ, టీకాలు, క్రమం తప్పకుండా చెక్అప్, తీవ్రమైన ఎండ పడకుండా చూసుకోవడం, పొగాకు/ఆల్కహాల్ దురలవాట్లకు దూరంగా ఉండడంలాంటి జాగ్రత్తలు క్యాన్సర్ రోగం బారినపడకుండా అడ్డుకుంటాయి.శరీరంలోని ఏ భాగంలోనైనా గడ్డలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం లాంటి చర్యలతో క్యాన్సర్ లేని ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాలు చేద్దాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -