– న్యాయవ్యవస్థతో సమన్వయం కచ్చితం
జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సంబంధిత న్యాయాధికారులతో సమన్వయం పెంచి బాధితులకు వేగంగా న్యాయం చేకూరే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యతతో పనిచేయాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు సూచించారు. ఈ నెల 15న జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన సమీక్షా సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల స్థితిని పరిశీలించారు. రాజీ పడదగిన కేసులను గుర్తించి లోక్ అదాలత్ లో పరిష్కారం దిశగా తీసుకెళ్లేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. చిన్న చిన్న వివాదాలను కోర్టుల వరకు తీసుకెళ్లకుండా పరస్పర అవగాహనతో పరిష్కరించడం సమాజానికి మేలు చేస్తుందని ఎస్పీ తెలిపారు.
అదేవిధంగా క్రిమినల్ కేసుల్లో నిందితులపై దృఢమైన ఆధారాలతో త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుని కన్విక్షన్ రేటును పెంచాలని సూచించారు. కేసుల పురోగతిని నిరంతరం పరిశీలించి, అవసరమైతే ఉన్నతాధికారుల సలహాలు తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. బాధితులకు న్యాయం చేకూర్చడమే మన ప్రధాన బాధ్యత అని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కె. శంకర్, డి.ఎస్పీ వై. మొగిలయ్య, గద్వాల్, అలంపూర్, శాంతినగర్ సీఐలు, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలతో పాటు డి.సి.ఆర్.బి ఎస్సై బి. స్వాతి, సిబ్బంది పాల్గొన్నారు.



