– 100 మంది బిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా.
నవ తెలంగాణ-సూర్యాపేట
ఉమ్మడి నల్లగొండ డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య పై అక్రమ కేసులు బనాయించడం అన్యాయమని అందుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు13 వ వార్డ్ కౌన్సిలర్ వట్టే రేణుక పేర్కొన్నారు. శనివారం స్థానిక గాంధీనగర్ లోని జానయ్య యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బహుజన కులాల అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని జానయ్య ప్రకటించడంతో తట్టుకోలేక విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కక్ష కట్టి డెబ్బై కి పైగా అక్రమ కేసులు మోపి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పార్టీలో అణచివేత ధోరణి పెరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీ పరంగా జరిగే సమావేశాలకు ఎలాంటి సమాచారం అందడం లేదని బిఆర్ఎస్ పార్టీలో ఇమడలేకనే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తల తో కలిసి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. బిఆర్ఎస్ పార్టీలో తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నామని కార్యకర్తలు తమకు అండగా ఉంటున్నారనే కారణంతో ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఒక్క మాట అన్నందుకే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఇబ్బందులకు గురి చేయడం శోచనీయమన్నారు. అణచివేత నిర్బంధాలను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయ వచ్చని పోటీ చేయవద్దని నిర్బంధం మోపటం రాజ్యాంగ విరుద్ధమని ఆమె మంత్రి పై ధ్వజమెత్తారు. ఏ పార్టీలో చేరేది ప్రస్తుతం నిర్ణయించుకోలేదని కార్యకర్తల అభీష్టం మేరకు త్వరలో నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు.పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పనిచేసే వారికి ఎలాంటి పదవులు లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినవారిలో మాజీ ఎంపీపీ భూక్యాకాంత, మాజీ ఎంపిటిసి ముక్కాల పద్మ, ఎల్కారం మాజీ సర్పంచి మోదాల సైదమ్మ, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ఉఫాధ్యక్షులు మహ్మద్ చాంద్ పాషా, సూర్యాపేట మండల బీసీ సెల్ అధ్యక్షులు కుంభం వెంకన్న యాదవ్, పెన్ పహాడ్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల అంజయ్య, పిల్లలమర్రి శివాలయం మాజీ చైర్మన్ వల్లాల సైదులు, బిఆర్ఎస్ జిల్లా నాయకులు లింగాల సైదులు, దురాజ్ పల్లి పెద్దగట్టు మాజీ డైరెక్టర్ చింతకాయల జానయ్య, వీరితోపాటు గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.