నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో అన్నీ సమస్యలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. బడా కాంట్రాక్టర్లు, కార్పొరేట్లకు లాభం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి మేలుకోకపోతే తెల్ల బంగారం పత్తిని తెచ్చి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోస్తామని హెచ్చరించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ని హరీశ్ రావు సందర్శించారు. పత్తి రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, బీజేపీ తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. వరంగల్ వరదల్లో 20 వేల ఇండ్లు మునిగిపోయాయి. సకాలంలో గేట్లు ఎత్తి ఉంటే వరంగల్ నగరం ముగిపోయేది కాదు. మునిగిపోయిన ఇళ్లకు రూ. 15 వేలు ఇస్తామన్నారు. రెండు నెలలు అయింది ఒక రూపాయి ఇవ్వలేదు. వెంటనే నష్టపరిహారం విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం.





