నవతెలంగాణ-హైదరాబాద్: అల్ ఫలా విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు జావేద్ అహ్మద్ సిద్ధిఖీని బుధవారం తెల్లవారుజామున ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్ (ఈడీ) 13 రోజులపాటు కస్టడీకి పంపింది. మంగళవారం సాయంత్రం ఉగ్రవాద సంబంధిత మనీలాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న సిద్ధిఖీని అర్థరాత్రి సమయంలోనే ఆమె నివాసంలోనే అదనపు సెషన్స్ జడ్జి శీతల్ చౌదరి ప్రధాన్ ఎదుట హాజరుపరిచారు. విచారణ తెల్లవారుజామున 1.00గంట వరకు కొనసాగింది. పిఎంఎల్ఎ చట్టంలోని సెక్షన్ 19 కింద అన్ని నిబంధనలను పాటించామని జడ్జి పేర్కొన్నారు. నేరం తీవ్రత మరియు దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉన్నందున నిందితుడికి 13 రోజుల పాటు ఇడి రిమాండ్ విధించడం సముచితమని తాను భావిస్తున్నానని అన్నారు.
అల్ ఫలా యూనివర్శిటీ యుజీసీ గుర్తింపు పొందినట్లు తప్పుగా ప్రకటించిందని, ఎన్ఎఎసి అక్రిడేషన్ స్థితిని కూడా తప్పుగా చూపించిందని ఈడీ పేర్కొంది. ఈ యూనివర్శిటీ 2018-25 ఆర్థిక సంవత్సరం నుండి రూ.415.10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, 2018 తర్వాత నుండి ప్రతి ఏడాది భారీ పెరుగుదల నమోదైందని తెలిపింది. 2018-19లో యూనివర్శిటీ రూ.24.21కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, 2024-25లో రూ.80.10 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. అల్ ఫలా ట్రస్ట్ మరియు యూనివర్శిటీకి చెందిన 19 ప్రాంగణాల్లో సోదాలు జరిపి సుమారు రూ.48 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.



