Thursday, November 20, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఆర్థిక సంక్షోభానికి కారణమెవరు?

ఆర్థిక సంక్షోభానికి కారణమెవరు?

- Advertisement -

భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఒక సంక్రమణ దశలో ఉంది. దేశాభివృద్ధికి పునాది వేసిన ప్రభుత్వ రంగ సంస్థలు నేడు అపూర్వమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితి యాదృచ్ఛికం కాదు, గత దశాబ్దంలో అమలైన కొన్ని త్వరపాటు నిర్ణయాలు, ఆలోచనలేని సంస్కరణలు, జాతీయ ఆస్తుల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం. ఒక దశాబ్దపు ఆర్థిక పొరపాట్లు ఒకసారి పరిశీలిస్తే ఒక్కోసారి భయమేస్తుంది. 2016 నవంబర్‌ 8 రాత్రి జరిగిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బతీసింది. డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ హెచ్చరించినట్టు జీడీపీలో రెండు శాతం పడిపోవడం ఒక్కటే కాదు, దేశపు అనధికారిక రంగం పూర్తిగా కుదేలైంది. లక్షలాది చిన్న, మధ్య తరహా వ్యాపారాలు మూతబడ్డాయి. ఆ దెబ్బ నుంచి కోలుకునేలోపే, ప్రభుత్వం తయారీ సరిగా లేని జీఎస్టీని అమలు చేసింది. పలుస్థాయిల పన్నులు, క్లిష్టమైన రిటర్నులు, చిన్న వ్యాపారులకు తీవ్రమైన భారమయ్యాయి. ఈ రెండు నిర్ణయాలు కలిసి ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలిక మాంద్యంలోకి నెట్టాయి. ప్రజలపై భారమయ్యే పన్నులు, కార్పొరేట్లకు పెద్దలాభాలు తెచ్చిపెట్టాయి.

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గిన సందర్భంలో, సాధారణంగా ప్రభుత్వాలు ప్రజలకు ఆ ప్రయోజనాలం దిస్తాయి. కానీ ఇక్కడ ధరలు తగ్గినా, పన్నులు మాత్రం పెరిగాయి. అదే సమయానికి, 2019లో ప్రభుత్వం కార్పొరేట్లకు భారీ పన్ను రాయితీ ఇచ్చింది. దేశ ఖజానాకు రూ.1.45 లక్షల కోట్ల నష్టం జరిగినా, పెట్టుబడులు పెరగలేదు. ప్రజారంగ సంస్థల ‘ఫర్‌ సేల్‌’. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టిన మార్గం, అతివేగంగా ప్రయివేటీకరణ. ఇది సంప్రదాయ ‘డిస్‌ఇన్వెస్ట్‌మెంట్‌’ కాదు. ఇది జాతీయ ఆస్తుల ‘అమ్మకం’ అది కూడా తొందరపాటు, అత్యవసర సమయాల్లో చేసే ఫర్‌ సేల్‌ విధానం. ప్రభుత్వ వాదన ఏంటంటే ప్రయివేటీకరణ వల్ల సామర్థ్యం పెరుగుతుందని, సంక్షేమ పథకాలకు నిధులు లభిస్తాయని. కానీ నిజంగా జరుగుతున్నది ఏమిటంటే లాభాలు ప్రయివేటు రంగానికి, నష్టాలు ప్రజలకు. అవ మానకరమైన చరిత్ర పాఠాలు తెలుసుకున్నా ప్రభుత్వ తీరు మారలేదు. బీఎస్‌ఎన్‌ఎల్‌ విక్రయం తక్కువ విలువలో జరిగినట్లు అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. నేడు కూడా ఐడీబీఐ, ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్‌ వంటి లావాదేవీలు నిజమైన డిస్‌ఇన్వెస్ట్‌మెంట్‌ కావు, అవి ప్రభుత్వం ఒక జేబులోంచి మరొక జేబులో డబ్బు మార్చినట్టు. దీర్ఘకాల ప్రమాదాలు గురించి ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు.

ఇప్పటికే నిరుద్యోగం అత్యధిక స్థాయిలో ఉండగా, ప్రజారంగ ఉద్యోగాలకు ముప్పు వస్తే దాని ప్రభావం ఘోరంగా ఉంటుంది. ఎక్కడ స్పష్టత లేదు. ఆస్తులకు విలువ ఎలా నిర్ణయించారు? రిజర్వ్‌ ప్రైస్‌ ఎలా లెక్కించారు? ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ముందుకు సాగుతుండటం అనుమానాలు మరింత పెంచుతుంది. అన్ని ప్రభుత్వరంగ సంస్థలు ఒకేలా ఉండవు. కొన్ని లాభాల్లోనే ఉన్నాయి. కొన్ని పునర్‌వ్యవస్థీకరణ చేస్తే లాభదాయక మవుతాయి. కొన్ని మాత్రమే అమ్మకానికి అనర్హం. ప్రతి సంస్థకు విడిగా వ్యూహం అవసరం. దీర్ఘకాలిక దృష్టి అవసరం. జాతీయ ఆస్తులు కాపాడే బాధ్యత అవసరం. ప్రభుత్వం తరచూ చెప్పేది – ”వాణిజ్యం చేయడం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు”. వాస్తవమేమిటంటే, దేశ ఆర్థిక వ్యవస్థను సరిగా నడపలేని ప్రభుత్వం, ఉద్యోగాలు సృష్టించలేని ప్రభుత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడలేని ప్రభుత్వం జాతీయ ఆస్తుల్ని అమ్మే హక్కులేదు. భారత ప్రజారంగం దేశ స్వావలంబనకు, సామాజిక సమానతకు, మౌలిక అభివృద్ధికి పునాది. దాన్ని తొందరపాటు నిర్ణయాలతో అడ్డగోలుగా విక్రయించడం భవిష్యత్తు తరాల పట్ల ఘోర అన్యాయం.

  • డా.ముచ్చుకోట సురేష్‌బాబు
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -