Thursday, November 20, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికార్మికులపై దమన 'నీతి' ప్రయోగం

కార్మికులపై దమన ‘నీతి’ ప్రయోగం

- Advertisement -

కార్మిక మంత్రిత్వ శాఖ ఇకనుంచి యాజమాన్యాల మంత్రిత్వశాఖగా మారబోతున్నదా! యాజమాన్యాల రక్త పిపాసత్వానికి రహదారులను ప్రభుత్వమే సిద్ధం చేస్తున్నదా! జంతుమాంసాన్ని గాక మనుషుల మాంసాన్ని భుజించే సుసంపన్నమైన వెసులుబాటుకు చట్టాలను రూపొందిస్తున్నదా! అక్కసుతో, ఆవేదనతో రాస్తున్న పంక్తులు కావివి. ఏ వేదనలు, వేధింపులు, వర్ణనాతీత బాధలకు ఆజ్యం పోస్తాయో తెలిసిన అనుభవసారంలోంచి ఉబికి పడుతున్న బాదాతప్త ఉచ్ఛ్వాసనిశ్వాసాలివీ. 29 కార్మిక చట్టాలను చుట్టగట్టి, చూరుచేసి, నాలుగు లేబర్‌కోడ్‌లుగా రూపొందించి కార్మికుల నరాలన్నింటినీ ఎలా బిగించాలో పార్లమెంట్‌ సాక్షిగా సిద్ధం చేశారు. వాటి అమలుకు ఆదేశాలు ఇంకా వెలువడక ముందే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, అనేకానేక కంపెనీలు ఆ నాలుగు లేబర్‌ కోడ్‌లలో ఉన్న వాటికన్నా ఎక్కువ నిర్బంధాలతో పని గంటలు పెంచింది.

రాత్రింబవళ్లూ తేడా లేకుండా ఉద్యోగులను రాచి రంపాన పెడుతూ, మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా ఇష్టారీతిన అన్ని వేళల్లోనూ సేవలు పని చేయించుకుంటూ రంపపు కోత ఇష్టాను సారంగా సాగుతున్నది. ఎందుకంటే కార్మికులకు రక్షణగా నిలిచిన ఈ వందేండ్లలో సాధించుకున్న ఇరవై తొమ్మిది కేంద్ర కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చిన లేబర్‌ కోడ్స్‌ కార్మికులను వధ్యశిలపై నిలిపితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన మంత్రిత్వ శాఖ ద్వారా ప్రజాబాహుళ్యంలో ఉంచిన ”శ్రమశక్తి నీతి- 2025” సదరు కార్మికులందరిని బలికి సిద్ధం చేస్తున్నది. ”శ్రమశక్తి నీతి-2025” పేరున కేంద్ర కార్మిక శాఖ కార్మిక చట్టాల స్వరూపాన్ని పూర్తిగా మార్చి వేసి, దాన్ని ప్రజాబాహుళ్యంలో ఉంచి, దానిపై స్పందన తెలియజేయవలసిందిగా ప్రజలను ప్రభుత్వం కోరుతున్నది. ప్రభుత్వాన్ని అడగవలసిన మొత్తం మొదటి ప్రశ్న; కార్మికులను ప్రభావితం చేసే అంశాలపై ప్రజలు స్పందించగలుగుతారా లేదా కార్మిక సంఘాలు, కార్మికులు స్పందిస్తారా? దీన్ని బట్టి కార్మిక సంఘాల పట్ల కార్మికుల పట్ల ఎంత నిర్లక్ష్య భావన ఈ పెద్దలకు ఉన్నదో స్పష్టంగా అర్థం కావడం లేదూ? ఈ శ్రమశక్తి నీతి విధానాన్ని రూపొందించడానికి కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని, మనుస్మృతిని, యజ్ఞవల్య్క స్మృతిని, నారద స్మృతిని, శుక్ర నీతి వంటివాటిని ప్రాతిపదికగా చేసుకుని రచించామని ప్రకటించారు.

వారెవా! మన సాంప్రదా యాలను, మన నమ్మకాలను ఉటంకిస్తూ మన వేలితో మన కన్నునే నేరుగా పొడుచుకోవడానికి ఎంతటి కుయుక్తులతో సిద్ధమవుతున్నారో చూడండి! ఇలాంటి స్మృతులను ఉటంకించి భవిష్యత్తులో చట్టాలకు బదులు సాంప్రదాయ వాదంలో సమాధానాలు వెతుక్కోమని చెప్పడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారన్నమాట! ”వ్యాపారం ద్రోహచింతనం” (వ్యాపారం చేయడం మోస ప్రవృత్తికి అవకాశం ఇస్తోంది (ఇదే అంశాన్ని కార్ల్‌మార్క్స్‌ కూడా స్పష్టంగా పేర్కొన్నాడు) అని చెప్పిన కౌటిల్యుని మాటలకు ఏ మాత్రం విలువనివ్వరు కానీ, ”లాభార్థి సర్వకార్య సాగుణ నీతి” (లాభాన్ని ఆశించేవాడు చేసే పనిలో అన్ని కార్యాలు సరైన విధానాలే) అనే అంశాన్ని మాత్రం యాజమాన్యానికి అనుకూలంగా అన్వయింప జూస్తున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో కార్మిక చట్టాలేవీ న్యాయ సమ్మతమైనవి కాకుండా చేయడానికి ఇవి నాంది. కోర్టులో కూడా సవాలు చేయడానికి వీలులేని విధంగా ఈ విధానాలను రూపొందిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతున్నది.

కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కనీస సభ్యుల సంఖ్యను అమాంతం పెంచివేయడం, నిరసనలు ధర్నాలు నిర్వహించడానికి అనుమతులను తప్పనిసరి చేయడం, సదరు నిరసనలు సమ్మెలు చేయడానికి కంపెని లేదా సంస్థ కార్యాలయానికి కనీసం రెండు కిలోమీటర్ల దూరాన్ని పాటించాలని షరతు విధించడం, పని ప్రదేశాలలో ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారాన్ని యాజమా న్యాల ఇష్టానుసారానికి వదిలివేయడం, కలిసికట్టుగా తెలిపే నిరసనను నేరపూరితంగా పరిగణించడం వంటివాటిని ప్రతిపాదిత నాలుగు లేబర్‌ కోడ్‌లలో పొందుపరిచినప్పుడే కార్మికుల, కార్మిక సంఘాల అస్థిత్వానికి చరమ గీతం పాడారు. ఇప్పుడు శ్రమశక్తినీతి పేరుమీద కనీసం ఇవన్నీ కూడా కార్మికులు పాటించినప్పటికీ యాజమాన్యాలు అవి జరిగే సందర్భంలో ఎలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడినా ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోవు, పైగా సూచనప్రాయ సలహాని మాత్రమే చేస్తాయి. పైపెచ్చు ”కోఆపరేటివ్‌ ఫెడరలిజం” అనే పేరును ఉటంకించి కార్మికులు యాజమాన్యాలు కలిసి మాట్లాడుకోవాలి తప్ప, పోరుబాట పట్టరాదు. ఇంకా చెప్పాలంటే యాజమాన్యాలకు సహకరిస్తూ, కావాల్సిన పరిహారాన్ని అర్థించాలి తప్ప డిమాండ్‌ చేసి బాధ పెట్టకూడదు. ఇలాంటి వాటిని కార్మిక చట్టాలు అంటారా? యాజమాన్య చట్టాలు అంటారా?

కార్మిక చట్టాల అమలుకు బాధ్యత వహించాల్సిన కేంద్రం కేవలం అవి అమలు జరిగేందుకు తోడ్పాటును అందిస్తుందట. (కంప్లియన్స్‌ టూ ఫెసిలిటేషన్‌) అనగా ఇక నుండీ ఎవరైనా యాజమాన్యాలు కార్మిక చట్టాలను పాటించకపోయినా అమలు చేయకపోయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన ఉండదు. ఒకవేళ కార్మికులెవరైనా తమ దృష్టికి తీసుకువస్తే ఇరు పక్షాలకు సూచనలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడూ కొనసాగుతూనే ఉన్నది. అనేక కంపెనీలు ప్రావిడెంట్‌ ఫండ్‌ చెల్లించకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం కేవలం సూచనప్రాయంగా కూడా మందలించడం లేదు. కార్మికులు, కార్మిక సంఘాలు కోర్టుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితాల సున్నా. పీఎఫ్‌ డిపార్ట్‌మెంట్లు ఏమి చేయలేని అసహాయతలో ఉన్నవి. ఇక నుంచి ఇది అధికారికంగా యాజమా న్యాలకు లభించే హక్కుగా మారబోతున్నది. కాంట్రాక్ట్‌ ఎంప్లాయిమెంట్‌ కల్పించే కాంట్రాక్టర్‌, వర్కర్‌లకు కాంట్రాక్ట్‌లోని అన్ని సదుపాయాలను కల్పించకపోతే, వర్కర్ల సేవలు పొందే ప్రిన్సిపల్‌ ఎంప్లాయర్‌ బాధ్యత వహించాలని కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టంలో ఉండేది. లేబర్‌ కోడ్‌లలో దీన్ని పూర్తిగా తొలగించారు.

ఇప్పుడు కాంట్రాక్టర్‌ బాధ్యత కూడా చట్ట పరిధి నుంచి తొలగిపోతున్నది. వర్కర్లను ఇష్టారీతిన తొలగించడానికి అనేక కార ణాలతో పాటు మార్కెట్లో చౌకగా లభించే వర్కర్లు ఉన్నారని చూపించడానికి కూడా వెసులుబాటు కల్పిస్తున్నారు. కంపెనీల్లో కార్మికులకు సంబంధిత అంశాలను పరిశీలించడానికి ఇన్‌స్పెక్టర్‌ను నియమించేది. ఇప్పుడు దాని పేరు ఫెసిలిటేటర్‌గా మార్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న లేబర్‌ పాలసీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్‌లో విధానసభల్లో చర్చించిన అనంతరం రాజ్యాంగం ద్వారా ఏర్పడినది. స్వాతంత్య్రానికి పూర్వమే అంబేద్కర్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ మొదలైంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 నుండి ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ సమావేశాలు జరగడం లేదు. త్రైపాక్షిక, అనగా ”కార్మికసంఘాలు, యాజమాన్యాలు- ప్రభుత్వం” కలిసి కార్మిక చట్టాల అమలు, కార్మికుల వెతలు, యాజమాన్య వ్యవస్థ స్థితిగతుల వంటి వాటిపై చర్చించాల్సిన అధికారిక కార్యక్రమం పూర్తిగా విడనాడబడింది. దీన్ని బట్టి కార్మికులపట్ల కార్మిక సంఘాల పట్ల ఎంతటి లక్ష్య వైఖరి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదో స్పష్టమవుతున్నది. ఇక నుంచీ ”ఫేర్‌ వేజ్‌, లివింగ్‌ వేజ్‌, మినిమమ్‌ వేజ్‌” అన్న విధానాలు ఉండవు. యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై వేతనాలు ఆధారపడి ఉంటాయి.

భారతదేశంలో యువత అత్యంత ఎక్కువ ఉన్నది. నిజానికి యువతను సరైన విద్ధంగా వినియోగించుకోవడం కోసం కావాల్సినంత సహజ వనరులు కూడా ఉన్నవి. సాగు,తాగునీటికి కటకటలాడే పరిస్థితి లేదు. రోడ్డు, జల, వాయు రవాణా సౌకర్యాలకు పూర్తిగా సహకరించే వాతావరణం ఉండడం భారతదేశానికి అదృష్టం. భారత ప్రజానీకంలో అత్యధిక పొదుపును ఇష్టపడి బ్యాంక్‌లో, స్టాక్‌ మార్కెట్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ లేదా పెన్షన్‌ ఫండ్‌లలో నిధులను జమ చేస్తున్నది. ఇవన్నీ ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులకు ఉపయుక్తంగా ఉన్నవి. ఇలాంటి చోట ఆర్థిక స్థితిగతి మెరుగుపడకుండా రోజురోజుకూ డాలర్‌తో రూపాయి మారకపు విలువ వెనకబడిపోతుంది. మనకన్నా ముందున్న జపాన్‌ చైనా ఆర్థిక వ్యవస్థలు అమెరికా డాలర్‌ను సవాల్‌ చేస్తుంటే భారత్‌ ఆస్థితిలో లేదు. ఇనుము, ఉక్కు కర్మాగారాలు చమురు ఉత్పత్తి విభాగాల్లో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యాలతో పటిష్టమైన వ్యవస్థలు ఉన్నవి. బ్యాంకింగ్‌ ఇన్సూరెన్స్‌ టెలికం వంటి రంగాలతో ఆర్థిక వ్యవస్థ కుదురుగా ఉన్నది.

వీటన్నింటినీ శక్తియుక్తులతో వినియోగించి భారత యువతను కావాల్సినంత ఉపయోగించుకొని దినదినాభివృద్ధితో శాఖోపశాఖలుగా విస్తరించాల్సిన ఆర్థిక వ్యవస్థను కేవలం నలుగురు వ్యక్తులు శాసించే దుస్థితికి భారత దేశం చేరుకుంటుంది. అలాంటి మిలియనీర్లు, బిలియనీర్లు మరింతమంది తయారు కావడానికి కేవలం అందుబాటులో ఉన్న కార్మికులను పీల్చి పిప్పి చేసి పిండుకుంటే అది ‘సబ్‌కాసాత్‌.. సబ్‌కా వికాస్‌’ ఎప్పటికీ కాజాలదు. పెట్టుబడిదారులు ప్రస్తుత కాలంలో కంపెనీ లాభాల కోసం వర్కర్ల వేతనాలని టార్గెట్‌ చేసుకొని చేస్తున్న ప్రయత్నాలు మన ముందున్నవి. అయితే కార్మికోద్యమ చరిత్రలో ఏనాడూ యాజమాన్యాలు గానీ, ప్రభుత్వాలు గానీ తమ దయాదాక్షిణ్యాలతో చేయి విదిలించిన సందర్భాలు లేవు. ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, చట్టాలు పోరాడి సాధించుకున్నవే తప్ప బుర్జువా పాలకులు ఇష్టంతో ప్రసాదించినవి కాదు. రాజకీయాలు పూర్తిగా డబ్బు మాయమైపోయి, అధికార పీఠానికి అమాయక ఓటర్లను చిరు కోరికలతో మోసం చేసే ప్రక్రియలో ఆశ్రిత పెట్టుబడిదారులు ఉపయోగపడుతున్నారు, కాబట్టే ఇలాంటి దుర్నీతి చట్టాలు ముందుకొస్తున్నాయి. వీటిని ఎదుర్కునే భాష కేవలం పోరాటం మాత్రమే.

జి.తిరుపతయ్య
9951300016

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -