Sunday, November 23, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్‌ సమ్మిట్‌

అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్‌ సమ్మిట్‌

- Advertisement -

రెండేండ్ల ప్రభుత్వ ప్రగతి, భవిష్యత్‌ ప్రణాళికలకు వేదిక
ఫ్యూచర్‌ సిటీిలో భారీ ఏర్పాట్లు
దేశ, విదేశీ ప్రముఖులకు ఆహ్వానం
అతిథులకు అత్యున్నత భద్రత
పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు
విజన్‌ 2047 డాక్యుమెంట్‌కు తుది మెరుగులు
25 నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వరుస సమీక్షలు

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఫ్యూచర్‌ సిటీలో డిసెంబర్‌ 8, 9 తేదీల్లో ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా గ్లోబల్‌ సమ్మిట్‌ పేరుతో విజయోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీని ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సీఎంవో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌రంజన్‌, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయిన నేపథ్యంలో విజయోత్సవాలను ప్రతిబింబించేలా ఫ్యూచర్‌ సిటీలో విశాలమైన ప్రాంగణంలో భారీ వేదిక ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

గ్లోబల్‌ సమ్మిట్‌ అందరినీ ఆకట్టుకునే అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని తలపించేలా ఉండాలని చెప్పారు. డిసెంబర్‌ 8న చేపట్టే కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విజయాన్ని చాటి చెప్పేలా ఉండాలన్నారు. డిసెంబరు 9న జరిగే కార్యక్రమంలో తెలంగాణ భవిష్యత్తు దార్శనికత, భవిష్యత్తు ప్రణాళికలు పొందుపరిచిన తెలంగాణ రైజింగ్‌ 2047 డాక్యుమెంటును ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని విభాగాలు తమ భవిష్యత్‌ లక్ష్యాలను కండ్లకు కట్టించే ఆడియో, వీడియో ప్రదర్శనలు, ప్రెజెంటేషన్లు తయారు చేసుకోవాలని సూచించారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, అన్ని రంగాల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు.

వేడుకలకు వచ్చిన అతిథులకు తగిన వసతి సదుపాయాలతో పాటు అత్యున్నత భద్రత కల్పించాలని చెప్పారు. ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలనీ, అన్ని విభాగాలు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటంలో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు గ్లోబల్‌ సమ్మిట్లో కీలక భాగస్వాములు కావాలని తెలిపారు. భవిష్యత్‌ లక్ష్యాలను నిర్దేశించుకోవటం, రైజింగ్‌ డాక్యుమెంట్‌లో పొందుపరిచే ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేసుకోవాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. ఈ ప్రణాళికపై ఈనెల 25 నుంచి తానే స్వయంగా వరుస సమీక్షలు నిర్వహిస్తానని తెలిపారు. ఇప్పటికే ప్రజాభిప్రాయాలు, సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల్లోని నిపుణుల దూరదష్టితో తెలంగాణ రైజింగ్‌ డాక్యుమెంట్‌ 2047 రూపకల్పన జరిగిందని సీఎం తెలిపారు. వివిధ విభాగాల అధికారులతో నిర్వహించే సమీక్షల్లో వచ్చే విలువైన సలహాలు, నిర్దిష్టమైన సూచనలను పొందుపరిచి డాక్యుమెంట్‌కు తుదిరూపం ఇస్తామని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -