నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సందర్భంలో మంగళవారం త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పరిశీలనలో పాల్గొన్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్, పలువురు అధికారులు, నాయకులు నిలిచి ఉన్న ప్రాంగణంలో బేస్మెంట్ కుంగిపోవడంతో అక్కడి జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన 144 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు నాసిరకం పనితనంతో మధ్యలోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే. నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యాయి.
ఈ నేపధ్యంలో అధికారులతో కలిసి పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ బేస్మెంట్పై నిలిచి ఉండగా అది ఒక్కసారిగా కిందికి కుంగడం కలకలం రేపింది. వెంటనే అధికారులు అప్రమత్తమై అందరినీ అక్కడి నుంచి దూరం చేశారు. ఎలాంటి ప్రాణాపాయం చోటు చేసుకోకపోవడం అదృష్టంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ నాణ్యతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.



