కేరళ శ్రామిక ప్రజానీకం ఏకగ్రీవ తీర్మానం
కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల సమావేశం
రాష్ట్రంలో అమల్జేయం : మంత్రి శివన్ ప్రకటన
తిరువనంతపురం : శ్రమల జీవుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కేరళ శ్రామిక ప్రజానీకం ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. కేరళ రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని కార్మిక సంఘాలతో గురువారం నాడు నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వి.శివన్కుట్టీ మాట్లాడుతూ, కార్మిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా వున్న లేబర్ కోడ్లపై సరైన రీతిలో చర్చలేవీ జరపకుండానే ఏకపక్షంగా రూపొందించి వాటినే బలవంతంగా రద్దుతున్నారని విమర్శించారు. అందువల్ల కేంద్రం వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు.
కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఈ లేబర్ కోడ్లను రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అమల్జేయబోమని ఆయన స్పష్టం చేశారు. మెజారిటీ రాష్ట్రాలు వీటిని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయని, కానీ కేరళ మాత్రం తీసుకోదని చెప్పారు. లేబర్ కోడ్లపై ముసాయి దా నిబంధనలు సిద్ధం చేయాలని కేంద్రం తీసుకువచ్చిన ఒత్తిడికి రాష్ట్రం లొంగిపోయిందా అని విలేకర్లు ప్రశ్నించగా లేదంటూ తిరస్కరించారు. ఒత్తిడికి లొంగిపోయి నట్లైతే లేబర్ కోడ్లను ఆమోదిస్తున్నట్ల్టు లేఖ ఇవ్వాలని, కానీ తాము అలా చేయలేదని చెప్పారు. అయినా ముసాయిదా నిబంధనలు కూడా రహ స్యంగా ఏమీ రూపొందించలేదన్నారు. అంతా బహిరం గంగానే జరిగిం దని, దానిపై ప్రజాభిప్రాయాన్ని కూడా కోరామన్నారు. తర్వాత దానిపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోలేదన్నారు.
ముసాయిదా, ముసాయిదాగానే మిగిలిపోయింది
2021లోనే లేబర్ కోడ్ల ముసాయిదాను రాష్ట్రం నోటిఫై చేయడంపై తలెత్తిన వివాదం గురించి మాట్లాడుతూ, ఆనాడు కేంద్రం, రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేసిందని, ఇందుకు సంబంధించి నిబంధనలను రూపొందించాల్సిందిగా రాష్ట్రాలను కేంద్రం ఆదేశించిందని చెప్పారు. దాంతో రాష్ట్ర కార్మిక కార్యదర్శి నిబంధనలను రూపొందించారన్నారు. వాటిని చర్చ నిమిత్తం పబ్లిక్ డొమైన్లో ప్రచురిం చడం కూడా జరిగిందన్నారు. తర్వాత 2022 జులైలో ముసాయిదాపై చర్చించేందుకు గానూ కార్మిక సంఘాల వర్క్షాప్ ఒకటి జరిగిందన్నారు. ఇప్పటివరకు, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ముసాయిదా కేవలం ముసాయిదాగానే మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు. గత మూడేళ్ళలో రాష్ట్రం దీనిపై ఎలాంటి చొరవ తీసుకోలేదంటేనే ఈ అంశంపై కేరళ ధృఢ వైఖరి తెలుస్తోందని అన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్మిక శాఖ మంత్రుల సమావేశంలో లేబర్ కోడ్ల్లో కార్మిక వ్యతిరేక నిబంధనలపై రాష్ట్రానికి గల తీవ్ర వ్యతిరేకతను కేంద్ర కార్మిక శాఖ మంత్రికి తెలియచేసినట్టు కూడా చెప్పారు.
డిసెంబరు 19న సదస్సు
లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల మంత్రులతో వచ్చే నెల్లో కార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు శివన్ కుట్టీ చెప్పారు. లేబర్ కోడ్లు కార్మికుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయన్నారు. అలాగే తమ స్వంత లేబర్ కోడ్లను రూపొందించుకోవడానికి రాష్ట్రానికి గల సాధ్యాసాధ్యాలపై డిసెంబరు 19న జరిగే ఒక రోజు సదస్సు చర్చిస్తుందని చెప్పారు. ఈ సదస్సులో నిపుణులు, కార్మిక సంఘాల నేతలు కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రం ఎంతవరకు జోక్యం చేసుకోగలదో కూడా ఈ సదస్సులో పరిశీలిస్తామన్నారు.



