Sunday, June 8, 2025
E-PAPER
Homeమానవినిర్ణ‌యాధికారంలో ఆమేక్క‌డ..?

నిర్ణ‌యాధికారంలో ఆమేక్క‌డ..?

- Advertisement -

మహిళలు దేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించేందుకు సిద్ధంగా ఉంటున్నారు. కేవలం తమ సమస్యలపైనే కాకుండా మొత్తం సమాజాన్నే ప్రభావితం చేసే విధ్వంసకర సంఘటనలు జరిగినప్పుడు ప్రశ్నిస్తున్నారు. మైనింగ్‌, ఆనకట్టలు, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జరిగే నిరసనలు ముందుడి నడుపుతున్నారు. కానీ నిర్ణయాధికారంలో మాత్రం వారికి సరైన స్థానం దగ్గడం లేదని అనేక విశ్లేషణలు పరిశీలిస్తే అర్థమవుతోంది. ఒకపక్క అవకాశం చిక్కినప్పుడల్లా దేశంలోని మహిళా శక్తి గురించి ప్రధాని ఎంతో గొప్పగా చెప్పుకొస్తున్నారు. మరోపక్క అందాల పోటీల పేర మహిళను ఓ సరుకుగా మార్చి కార్పొరేట్లకు కోట్లు సంపాదించి పెడుతున్నారు. అయితే దేశంలో నిర్ణయాలు తీసుకునే చోట మాత్రం ఏ స్థాయిలోనూ మహిళలకు సరైన భాగస్వామ్యం లేదని ఇటీవలి విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం…
ఒడిశా అడవుల నుండి మొదలుపెడితే తమిళనాడు తీరప్రాంతాల వరకు మహిళలు నిరంతర ప్రతిఘటన ఉద్యమాలకు నాయకత్వం వహించారు. సిజిమాలి (ఒడిశా)లో తమ జీవిన విధానంలో భాగమైన అడవిని దూరం చేయజూస్తున్న మైనింగ్‌ ప్రాజెక్టులను అక్కడి మహిళలు నేటకీ నిరసిస్తూనే ఉన్నారు. పోలీసుల హింసను ఎదుర్కొంటున్నారు. జార్ఖండ్‌లో, దేవాస్‌లోని ఆదివాసీ మహిళలు తమ పూర్వీకుల భూమిని రక్షించుకోవడానికి బొగ్గు మైనింగ్‌ను అడ్డుకుంటున్నారు. మేధా పాట్కర్‌ నడిపిన నర్మదా బచావో ఉద్యమం ఆనకట్టల వినాశకరమైన ప్రభావాన్ని ప్రపంచ దృష్టికి తీసుకువచ్చింది. ఇలా మహిళలు దేశంలో ఎన్నో ప్రతిఘటనకు కేంద్రంగా ఉన్నప్పటికీ నిర్ణయాధికారంలో మాత్రం మినహాయించబడుతూన ఉన్నారనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే.
సమగ్ర భూ విధానం లేక…
దక్షిణ భారతదేశంలో మహిళల భూమి హక్కులను రక్షించడానికి చట్టపరమైన చట్రాలు ఉన్నాయి. అయితే అవి కేవలం కాగితాలకే పరిమితం అనుకోండీ! భారతదేశ అటవీ హక్కుల చట్టం (2006), పీఇఎస్‌ఏ చట్టం (1996) గ్రామసభల్లో మహిళల పాత్రను గుర్తించి సమాన హక్కులను కల్పించాయి. అయితే మన దగ్గర భూమిపై హక్కులు సాధారణంగా పురుషులకే ఉంటుంది. అక్కడక్కడ మాత్రమే మహిళల పేరు ఉంటుంది. ఇక గ్రామసభలైతే పురుషాధిక్యంలోనే నడుస్తాయి. దీనికి ప్రధాన కారణం మన దేశంలో జాతీయ స్థాయిలో లింగ సమానత్వాన్ని సూచించే సమగ్ర భూమి విధానం లేకపోవడమే. చివరకు రాష్ట్రాల భూ పున:పంపిణీ కార్యక్రమం కూడా ఒంటరి మహిళలు, వితంతువులు, అధికారిక డాక్యుమెంట్లు లేని మహిళలను పట్టించుకోదు. ఇక సమాన వారసత్వ హక్కులను కల్పించే హిందూ వారసత్వ చట్టానికి 2005 సవరణ ఉన్నప్పటికీ ఇది ఆచరణలో ఉండదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో అయితే పరిస్థితి మరింత దారుణం. వీరికైతే అసలు చట్టాలు, హక్కులు ఉన్న విషయమే తెలియదు.
పెరుగుతున్న అసమానతలు
ఇక పర్యావరణ కాలుష్యం వల్ల దేశ వాతావరణంలో వస్తున్న పెను మార్పులతో లింగ వివక్ష మరింత స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్రమైన వేడి, నీటి కొరత, పర్యావరణ కాలుష్యం ఇప్పటికే ఉన్న లింగ అసమానతలను తీవ్రతరం చేస్తున్నాయి. మహిళలు నీటి కోసం నెత్తి మీద కడవలతో కిలోమీటర్ల కొద్ది నడవాల్సి వస్తోంది. ఇంట్లో అనారోగ్యంతో బాధపడే వారిని చూసుకోవల్సిన బాధత్య కూడా వీరికే ఉంటుంది. మరీ ముఖ్యంగా తక్కువ ఆదాయంతో ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తోంది. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ వాటి పరిష్కారానికి సంబంధించిన నిర్ణయాల నుండి మాత్రం మినహాయించబడుతున్నారు. అంటే వివక్ష ఏ స్థాయిలో ఉందో, మహిళా సమానత్వం గురించి ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.
నాయకత్వాన్ని విస్తృతం చేయాలి
ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు రావాలంటే కేవలం వీధుల్లోనే కాకుండా శాసనసభల్లో కూడా మహిళలకు మాట్లాడే అవకాశం కల్పించాలి. దేశ అభివృద్ధి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలంటే, వాతావరణ విధానం న్యాయంగా ఉండాలంటే, ప్రతిఘటన అర్థవంతంగా ఉండాలంటే మహిళల గొంతులు వినిపించడమే కాదు, వారు నాయకత్వం వహించాలి. వారి కథలు బాధితుల కథలు కాదు సామాజిక దృక్పథానికి సంబంధించినవి. మన విధానాలు, చట్టాలు, సంస్థలు ఆ సత్యాన్ని ప్రతిబింబించే సమయం ఇది. కనుక ఉద్యమాల్లో మహిళా నాయకత్వాన్ని విస్తృతం చేయాలి. దీనికోసం ఉద్యమ కారులు, స్వచ్ఛంద సంస్థలు, విధాన నిర్ణయాలు చేసే పాలకులు మహిళల నాయకత్వాన్ని గుర్తించి మద్దతు ఇవ్వాలి.
ప్రభుత్వాలు చొరవ చూపాలి
లింగ న్యాయం, వాతావరణ న్యాయం, సమగ్ర అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన సమయం ఇది. ప్రభుత్వాలు దీనికి చొరవ చూపాలి. గ్రామ స్థాయి నుండి జరిగే ప్రతి సమా వేశం మహిళలకు అనుకూలమైన సమయాల్లో ఏర్పాటు చేయాలి. అంతేకాదు సమావేశం జరిపే స్థలాలు కూడా మహిళలకు అందుబాటులో ఉండాలి. దీనికి అవసరమైన చట్టాలను రూపొందించాలి. అప్పుడే మహిళలు నిర్ణయాధికారంలో భాగస్వాములు కాగలుగుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -