నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. గడువు ముగిసే సమయానికి క్యూలైన్లో ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.
ఈ మూడో దశలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,752 సర్పంచ్ స్థానాలకు, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే.. మధ్యాహ్నం 1 గంటల వరకు 80.78% పోలింగ్ నమోదయ్యింది. తొలుత వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. వార్డుల లెక్కింపు పూర్తి కాగానే సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. సాయంత్రానికల్లా మెజారిటీ గ్రామాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.



