విధుల్లో వున్న మహిళా న్యాయవాదిపై దారుణం
కేంద్రానికి, యూపీ సర్కార్కు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ : నోయిడాలోని ఒక పోలీసు స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి, కస్టడీలోనే లైంగికదాడికి పాల్పడ్డారని ఒక మహిళా న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాల్సిందిగా సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జనవరి 7కల్లా వీటిపై స్పందించాల్సిందిగా కోరింది. దాడి జరిగిందని చెబుతున్న సమయంలో ఆ పోలీసు స్టేషన్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని తొలగించకుండా లేదా ధ్వంసం చేయకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా గౌతమ్ బుద్ధ నగర్ పోలీసు కమిషనర్ను కూడా ఆదేశించాలని జస్సిట్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
తనను14గంటల పాటు చట్ట విరుద్ధంగా నిర్బంధించారని, పైగా ఆ సమయంలోనే తనపై వేధింపులు, లైంగిక దాడి వంటి చర్యలకు పాల్పడ్డారని ఆ మహిళ తన పిటిషన్లో పేర్కొంది. ఆ పిటిషన్ను శుక్రవారం విచారించిన బెంచ్ పై ఆదేశాలు వెలువరించింది. నోయిడాలోని సెక్టార్ 126 పోలీసు స్టేషన్లో సిబ్బంది తన పట్ల అనుచితంగా వ్యవహరించారని, ఇదంతా డిసెంబరు 3వ తేదీ అర్ధరాత్రి జరిగిందని ఆమె పేర్కొంది. తన క్లయింట్ తరపున తీసుకోవాల్సిన చర్యల కోసం తాను వెళ్ళాల్సి వచ్చిందని ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు. మహిళా న్యాయవాది కేసు చాలా దారుణమైనదని, విధుల్లో వున్న ఆమెను చట్ట విరుద్ధంగా నిర్బంధించడమే కాకుండా లైంగికదాడికి దిగడం అనుచితమని సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పేర్కొన్నారు.



