నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 30 మంది భారతీయులను యూఎస్ బోర్డర్ పెట్రోల్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరు కమర్షియల్ డ్రైవర్ లైసెన్సులు (సీడీఎల్) కలిగి ఉండి, భారీ సెమీ ట్రక్ వాహనాలను నడుపుతున్నట్లు గుర్తించారు. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టర్లో జరిగిన తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) వెల్లడించింది.
నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 వరకు ఇంటర్ స్టేట్ హైవేలు, ఇమిగ్రేషన్ చెక్పోస్టుల వద్ద జరిగిన తనిఖీల్లో మొత్తం 42 మంది అక్రమ వలసదారులను పట్టుకున్నారు. వీరిలో 30 మంది భారతీయులు కాగా, మిగిలిన వారు ఎల్సాల్వడార్, చైనా, హైటి, మెక్సికో, రష్యా తదితర దేశాలకు చెందినవారు. వీరికి కాలిఫోర్నియా సహా ఫ్లోరిడా, న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాలు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 10, 11 తేదీల్లో ‘ఆపరేషన్ హైవే సెంటినెల్’ పేరుతో ఐసీఈ, హోంల్యాండ్ సెక్యూరిటీ సంస్థలతో కలిసి భారీ స్థాయి దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో మరో 45 మంది అక్రమ వలసదారులు అరెస్ట్ అయ్యారు. కాలిఫోర్నియాలోని ట్రక్కింగ్ కంపెనీలే లక్ష్యంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.



