నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాశ్ విజయవర్గీయ మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇండోర్లోని భగీరథ్పురా ప్రాంతంలో జరిగిన కలుషిత తాగునీటి ఘటనపై మీడియా ప్రశ్నలపై ఆయన విరుచుకుపడ్డారు. భగీరథ్పురా ఇండోర్ -1 అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇటీవల ఈ ప్రాంతంలో కలుషిత నీటితో అతిసారం కారణంగా నలుగురు మరణించగా, 212మంది ఆస్పత్రి పాలయ్యారు. 50మంది డిశ్చార్జ్ అవగా, పలువురు చికిత్స పొందుతున్నారు.
ఈ అంశంపై బుధవారం రాత్రి రాష్ట్రపట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రి విజయవర్గీయ మీడియా వివరణ కోరింది. భగీరథపురాకు చెందిన పలువురు రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించిన బిల్లులు ఎందుకు వాపసు పొందలేదని, నివాసితులకు తాగునీటి ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన మంత్రి పనికిరాని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారంటూ విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండోర్లో నీటికాలుష్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 8 నుండి 10కి చేరిందని, బాధ్యత వహించాల్సిన బీజేపీ నేత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జితు పట్వారా పేర్కొన్నారు.



