– ముంబయిపై సన్రైజర్స్ ఘన విజయం
– ఛేదనలో ట్రావిషేక్, క్లాసెన్ మెరుపులు
– ముంబయి 243/5 హైదరాబాద్ 249/4
వాంఖడెలో పరుగుల వరద. ట్రావిశ్ హెడ్ (76), క్లాసెన్ (65 నాటౌట్), అభిషేక్ (45) దంచికొట్టడంతో వాంఖడెలో సన్రైజర్స్ రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. మరో 8 బంతులు ఉండగానే 244 పరుగుల లక్ష్యాని ఊదేసింది. 6 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్పై ఘన విజయం సాధించింది. ఐపీఎల్19లో సన్రైజర్స్కు ఇది ఆరో విజయం కాగా, ముంబయికి ఇది ఆరో ఓటమి.
నవతెలంగాణ-ముంబయి
బ్యాటర్లు సమిష్టిగా చెలరేగటంతో ముంబయి ఇండియన్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 244 పరుగుల ఛేదనలో ఓపెనర్లు ట్రావిశ్ హెడ్ (76, 30 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లు), అభిషేక్ శర్మ (45, 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) తొలి వికెట్కు 8.4 ఓవర్లలోనే 129 పరుగుల భారీ భాగస్వామ్యంతో అదరగొట్టారు. ఓపెనర్లు విజయానికి గట్టి పునాది వేసినా.. ముంబయి ఇండియన్స్ వరుసగా మూడు వికెట్లతో రేసులోకి వచ్చింది. 129/0తో ఉన్న హైదరాబాద్.. గజాన్ఫర్, హార్దిక్ దెబ్బకు 133/3తో ఒత్తిడిలో పడింది. ముంబయి ఇండియన్స్ మ్యాచ్ రేసులోకి వచ్చిందని అనుకుంటే.. హెన్రిచ్ క్లాసెన్ (65 నాటౌట్, 30 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లు), నితీశ్ కుమార్ రెడ్డి (21, 17 బంతుల్లో 3 ఫోర్లు) సన్రైజర్స్ గెలుపు ఖాయం చేశారు. ట్రావిశ్ హెడ్ ఆరు సిక్స్లు, మూడు ఫోర్లతో 20 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించగా.. క్లాసెన్ చూడచక్కటి షాట్లతో 3 సిక్స్లు, ఆరు ఫోర్లతో 22 బంతుల్లో ఫిఫ్టీ అందుకున్నాడు. స్పిన్నర్లు అశ్వని కుమార్, గజాన్ఫర్ సహా బుమ్రాపై కండ్లుచెదిరే సిక్స్లు కొట్టిన క్లాసెన్ మ్యాచ్ను ఏకపక్షం చేశాడు. ఆఖర్లో నితీశ్ నిష్క్రమించినా.. సాలిల్ అరోరా (30 నాటౌట్, 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హార్దిక్ ఓవర్లో ఓ ఫోర్, రెండు సిక్సర్లతో లాంఛనం ముగించాడు. 18.4 ఓవర్లలో 4 వికెట్లకు సన్రైజర్స్ 249 పరుగులు చేసింది. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో గజాన్ఫర్ (2/51), ట్రెంట్ బౌల్ట్ (1/41) వికెట్లు పడగొట్టారు.
రికెల్టన్ సెంచరీ వృథా
వరుస ఓటములతో డీలా పడిన ముంబయి ఇండియన్స్కు విదేశీ ఓపెనర్లు అదిరే ఆరంభం అందించారు. రియాన్ రికెల్టన్ (123, 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్లు) అజేయ సెంచరీతో చెలరేగగా.. విల్ జాక్స్ (46, 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. ఓపెనర్లు 7.1 ఓవర్లలో 93 పరుగులు జోడించగా ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు దిశగా సాగింది. సూర్యకుమార్ యాదవ్ (5), తిలక్ వర్మ (7) నిరాశపరిచారు. నమన్ దిర్ (22), హార్దిక్ పాండ్య (31) ధనాధన్ ఇన్నింగ్స్లు ఆడారు. 23 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన రికెల్టన్.. 44 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. సన్రైజర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే (2/54), సకిబ్ హుస్సేన్ (1/39) రాణించారు.



