నవతెలంగాణ-హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స్పందించింది. కేరళంలో ప్రజాతీర్పును గౌరవీస్తామని పేర్కొంది. పదేండ్ల సీపీఐ(ఎం) పాలనలో ప్రజాసంక్షేమానికి పాటుబడ్డామని, ఆర్థికంగా కేంద్రంలోని బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా విద్యా, వైద్య, వ్యవసాయ, ఉపాధి కల్పనలో కేరళంలో ఆమోగమైన అభివృద్ధిని చేసి చూపించామని ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత ఎన్నికల్లో సీపీఐ(ఎం)తో పాటు మిత్రపక్షాలకు ఓటు వేసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపింది. ప్రతిపక్షంలో ప్రజా సమస్యల సాధనకోసం నిరంతరం పోరాటం చేస్తామని వెల్లడించింది. అధిక మోజార్టీ సాధించిన యూడీఎఫ్ బృందానికి శుభాకాంక్షలు తెలియజేసింది. తమిళనాడులో అద్బుత విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్కు పోలిట్ బ్యూరో శుభాకాంక్షలు తెలిపింది.
అసోం, బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ కుటిల రాజకీయాలు చేసిందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో మండిపడింది. ఓట్ల సవరణ ప్రక్రియను బీజేపీ ప్రభుత్వం స్వార్థప్రయోజనాలకు వాడుకుందని, ఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కేంద్ర దర్యాప్తు సంస్థలైనా ఈడీ,సీబీఐ, ఐటీలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేసిందని మండిపడింది. ప్రతిపక్షాలే లక్ష్యంగా దాడులు చేయించిందని ఆరోపించింది. ప్రజల మధ్య విద్వేషాలు పెంచే విధంగా బీజేపీ నేతలు రాజకీయ ప్రసంగాలు చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తింది. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ వ్యవహరించిన తీరుపట్ల ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఏకమై సమగ్ర చర్చ చేపట్టాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది.



