నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్ పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ దేశ ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇంధన వినియోగం, విదేశీ మారక ద్రవ్యం ఆదా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి అంటూ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో, దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా పెట్రోల్, డీజిల్ను పరిమితంగా వినియోగించాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సొంత వాహనాల కంటే వీలైనంత వరకు మెట్రో రైళ్లు, బస్సులు వంటి ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించాలని సూచించారు. పర్యావరణ హితమైన, పొదుపైన ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు మళ్లాలని కోరారు. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలన్నారు. ఆఫీసులకు వెళ్లడం తగ్గించి, వీలైనంత వరకు ‘వర్క్ఫ్రమ్ హోమ్’, ‘ఆన్లైన్ మీటింగ్లు’ నిర్వహించుకోవాలని సూచించారు. ఇది ఇంధన ఆదాకు ఎంతగానో తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశంలో విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మోడీ నొక్కి చెప్పారు. ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరిగాయని, దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కనీసం ఏడాది పాటు ప్రజలు బంగారం కొనడం ఆపివేయాలని కోరారు. గతంలో యుద్ధ సమయాల్లో దేశం కోసం ప్రజలు బంగారం దానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే దేశంలో రాగి (Copper) కొరత తీవ్రంగా ఉందని, వనరులను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలు తమ ఖర్చులను నియంత్రించుకోవాలని ప్రధాని కోరారు. ఆడంబరాలు వద్దని, అనవసరమైన దుబారా ఖర్చులు, ఆడంబరాలకు దూరంగా ఉండాలని సూచించారు.



