Wednesday, May 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనర్సింగ్‌ వృత్తి కాదు మానవసేవ

నర్సింగ్‌ వృత్తి కాదు మానవసేవ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నర్సింగ్‌ అనేది ఒక వృత్తి కాదు మానవ సేవ అనీ, రోగులకు చికిత్సలో సహకరిస్తూనే వారికి ధైర్యం, భరోసా, ఆశను కల్పించేది నర్సులేనని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కొనియాడారు. మంగళవారం హైదరాబాద్‌లోని కోఠిలో గల ఉస్మానియా మెడికల్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఆరోగ్యశాఖలో ఉద్యో గాలు పొందిన 1919 మంది నర్సింగ్‌ ఆఫీసర్లకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, మీర్జా రహ్మత్‌ బేగ్‌, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చొంగ్తు, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ సంగీత సత్య నారాయణ, డీఎంఈ నరేంద్ర కుమార్‌, టీవీవీపీ కమిషనర్‌ అజరు కుమార్‌, డీపీహెచ్‌ రవింద్ర నాయక్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్‌ రాజనర్సింహ మాట్లాడుతూ.. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నర్సులందరికీ హదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నర్సింగ్‌ రంగానికి మార్గదర్శకురాలైన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ను స్ఫూర్తిగా తీసుకుని వైద్య సేవలందించాలని నర్సులకు సూచించారు. కుటుంబ సభ్యులు కూడా రోగుల దగ్గరకు రాని కరోనా సమయంలో నర్సులు అందించిన సేవలను ప్రజలెవ్వరూ మరిచిపోరన్నారు. అత్యంత ప్రాధాన్యతతో వైద్యారోగ్యశాఖలోని 13 వేల పోస్టులను భర్తీ చేశామని వివరించారు.

రెండున్నరేండ్లలో తొమ్మిది వేల నర్సింగ్‌ పోస్టులను భర్తీ చేసిన ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. మరో 5 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందనీ, అందులో సుమారు 2 వేల ఏఎన్‌ఎం పోస్టుల ఫలితాలు మరో ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. న్యాయపరమైన కారణాలతో ఆలస్యమైన 732 ఫార్మసిస్ట్‌ పోస్టుల భర్తీని కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీనిచ్చారు. 16 ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేసి 960 బీఎస్సీ నర్సింగ్‌ సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. విద్యానంతరం విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన స్కిల్స్‌ను ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ విద్యార్థులకు నేర్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో దాదాపు లక్షా 80 వేల మంది రిజిస్టర్డ్‌ నర్సులు సేవలందిస్తున్నారనీ, వారి సంక్షే మం, వత్తిపరమైన అభివద్ధికోసం ప్రత్యేక నర్సింగ్‌ డైరెక్టరేట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 మిడ్‌వైఫరీ ట్రైనింగ్‌ కళాశాలల్లో మొత్తం 90 సీట్లు మాత్రమే ఉన్నాయనీ, దశలవారీగా అన్ని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలకు మిడ్‌వైఫరీ ట్రైనింగ్‌ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రతి పౌరునికీ మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంలో నర్సుల కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -