నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాంగ్లోయ్ ప్రాంతంలో కదులుతున్న ప్రయివేట్ బస్సులో ఒక మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. లైంగికదాడికి ఉపయోగించిన బస్సును కూడా స్వాధీనం చేసుకున్నట్లు గురువారం వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పితంపుర మురికివాడలో నివసించే బాధితురాలు మంగోల్పురిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మే 11న (సోమవారం) రాత్రి పని ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో సరస్వతి విహార్ వద్ద ఆగి ఉన్న ఒక స్లీపర్ బస్సు డోర్ వద్ద నిలబడిన వ్యక్తిని ఆమె టైమెంత అని అడిగింది. వెంటనే అతడు, మరో వ్యక్తి ఆమెను బలవంతంగా బస్సులోకి లాగారు.
అనంతరం వారు బస్సును రాణి బాగ్ నుంచి నాంగ్లోయ్ వైపు తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. వివాహిత అయిన బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం రాణి బాగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.



