జట్టులో వైభవ సూర్యవంశీకి చోటు
ముక్కోణపు సిరీస్కు భారత్-ఏ జట్టు ఎంపిక
నవతెలంగాణ-ముంబయి : తెలుగు తేజం, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మను భారత క్రికెట్ నాయకత్వ బృందంలో చేరాడు!. జూన్ 5 నుంచి శ్రీలంక వేదికగా జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్కు భారత్-ఏ జట్టును బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ గురువారం ఎంపిక చేసింది. వైట్బాల్ ఫార్మాట్లో టీ20, వన్డేల్లో సీనియర్ జట్టు తరఫున రాణించిన తిలక్ వర్మను సెలక్షన్ కమిటీ భారత్-ఏ జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేసింది. దీంతో భవిష్యత్లో భారత జట్టు నాయకత్వ బాధ్యతలకు తిలక్ వర్మకు ఇది తొలి పరీక్షగా నిలువనుంది. ఇక యువ సంచలనం, 15 ఏండ్ల బుడతడు వైభవ్ సూర్యవంశీ తొలిసారి సీనియర్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. రెండేండ్లుగా ఐపీఎల్లో, ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ భారత్-ఏ తరఫున బరిలోకి దిగనున్నాడు. పంజాబ్ కింగ్స్ తరఫున గొప్పగా రాణిస్తున్న ఓపెనింగ్ ద్వయం ప్రియాన్షు ఆర్య, ప్రభుసిమ్రన్ సింగ్లు సైతం జట్టులోకి ఎంపికయ్యారు.
జార్ఖండ్ విధ్వంసక వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర జట్టులో నిలువగా.. నిశాంత్ సింధు, హర్ష్ దూబె, సూర్యాన్షు షెడ్జె, యుధ్వీర్ సింగ్లు పేస్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. జమ్మూకశ్మీర్ రంజీ చాంపియన్ నిలువటంలో కీలకంగా నిలిచిన యుధ్వీర్ సింగ్ తొలిసారి భారత్-ఏ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నాడు. రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్గా ఎంపికవగా.. అన్షుల్ కాంబోజ్ సైతం జట్టులో నిలిచాడు. భారత్-ఏ జట్టులో తిలక్ వర్మ, రియాన్ పరాగ్, అన్షుల్ కాంబోజ్ మాత్రమే ఇప్పటివరకు సీనియర్ జట్టు తరఫున ఆడారు. అఫ్గనిస్తాన్, శ్రీలంక, భారత్ పోటీపడుతున్న ముక్కోణపు వన్డే సిరస్ జూన్ 9న ఆరంభం కానుండగా 21న ఫైనల్ జరుగనుంది. ముక్కోణపు వన్డే సిరీస్ అనంతరం శ్రీలంక-ఏ జట్టుతో భారత్-ఏ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పోటీపడనుంది. రెడ్బాల్ ఫార్మాట్కు భారత్-ఏ జట్టును ప్రకటించాల్సి ఉంది.
ముక్కోణపు సిరీస్కు బారత్-ఏ జట్టు
తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాన్షు ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుశ్ బదొని, నిశాంత్ సింధు, హర్ష్ దూబె, సూర్యాన్షు షెడ్జె, ప్రభుసిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.



