నవతెలంగాణ- అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలో పశువులు (మూగజీవాలు) అక్రమ రవాణాపై ప్రత్యేక నిగా పెట్టినట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పోలీసులను ఆదేశించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పశువుల అక్రమ రవాణా పై తీసుకుంటున్న చర్యల గురించి శుక్రవారం జిల్లా ఎస్పీ తో నవతెలంగాణ వివరాలు సేకరించింది.
పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు బిజినపల్లి మండలం మంగనూరు, వంగూరు మండలం చారగొండ చెక్ పోస్ట్, అమ్రాబాద్ మండలం మన్ననూరు చెక్ పోస్ట్, తిమ్మాజీపేట మండలం మరికల్ చెక్ పోస్ట్, వెల్దండ మండలం కొట్రా గేట్ చెక్ పోస్ట్ ల వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారని ఎస్పీ వెల్లడించారు. జిల్లా లో జరుగుతున్న పశువుల సంతలపై నిఘా పెట్టినట్లు తెలిపారు.
పశువులతో వెళుతున్న వాహనాలను పకడ్బందీగా తనిఖీలు చేయాలని, కొనుగోలు చేసిన రసీదులు వ్యవసాయ శాఖ అధికారుల అనుమతి పత్రాలను తనిఖీ చేయాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు.



