నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్కు న్యాయమూర్తి పోక్సో కేసులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. శనివారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య అరెస్టయిన ఆయనను, మేడ్చల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మే 29 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం పోలీసులు భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించారు.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో భగీరథ్పై మే 8న పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు తొలుత సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ, తర్వాత తీవ్రమైన పోక్సో చట్టంలోని సెక్షన్ 5(l) రెడ్ విత్ సెక్షన్ 6 కిందకు మార్చారు.
శనివారం రాత్రి 8:15 గంటల సమయంలో హైదరాబాద్లోని అప్పా జంక్షన్ వద్ద భగీరథ్ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించి రెండు గంటలకు పైగా విచారించారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి, అర్ధరాత్రి సమయంలో మేడ్చల్ మేజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిచారు.



