– ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా నాయకత్వం
– జిల్లా నాయకుడు చిరంజీవికి పరామర్శ
నవతెలంగాణ – అశ్వారావుపేట : సీపీఐ(ఎం) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను జూన్ 3, 4, 5 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. నియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలోని శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు నేతృత్వంలో పార్టీ నాయకులు శిక్షణా తరగతుల ఏర్పాట్లను పరిశీలించారు. భవన సముదాయం, తరగతుల నిర్వహణ, భోజన సదుపాయాలు, వసతి ఏర్పాట్లు, అవసరమైన వనరుల సమీకరణ, ప్రతినిధుల హాజరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఇటీవల హృద్రోగ శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న జిల్లా నాయకుడు చిరంజీవిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, అన్నవరపు సత్యనారాయణ, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్,మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



