ముఖ్యమంత్రి మాటను గుర్తు చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు
ఐదు శాతం వేతన పెంపు ప్రతిపాదనలపై సర్వత్రా నిరసన
గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్
నవతెలంగాణ – వేలేరు‘
చాయ్ తాగేలోపు’ సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్న సీఎం మాటలు నీటి మూటలుగా మిగిలాయని సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఇక కాంట్రాక్టు ఉద్యోగమే ఉండబోదననీ, అందరినీ క్రమబద్ధీకరిస్తామని నమ్మబలికిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు కాలయాపన చేసింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది’’ అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18వేల మంది సమగ్ర శిక్షా ఉద్యోగులు విద్యావ్యవస్థలో పని చేస్తున్నారు. ‘సమాన పనికి సమాన వేతనం’ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా, నేటికీ వీరికి అరకొర జీతాలే అందుతున్నాయి. ఈనెల 28న ఢిల్లీలో జరిగే ప్రాజెక్ట్ ఆమోదిత మండలి సమావేశం కోసం విద్యాశాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలు ఉద్యోగులను విస్మయానికి గురిచేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 50శాతం వరకు వేతన పెంపునకు అవకాశం కల్పించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5శాతం(రూ.600 నుంచి రూ.2,000) పెంపునకే మొగ్గు చూపడమంటే ఉద్యోగులను అవమానించడమేనని పలువురు అభిప్రాయప డుతున్నారు. 2023 ఎన్నికల సమయంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె చేపట్టగా ఆనాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి స్వయంగా వారి దీక్షా శిబిరానికి వచ్చి.. ‘మేం అధికారంలోకి రాగానే చాయ్ తాగేలోపే మీ సమస్యలు పరిష్కరిస్తాం’ అని ఇచ్చిన హామీ నేడు సీఎం అయ్యాక ఏమైందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంలో పని చేసిన కొందరు ఉన్నతాధికారులు పాత ప్రతిపాదనలనే ‘కాపీ పేస్ట్’ చేసి పంపిస్తూ ఉద్యోగుల ప్రయోజనాలకు గండి కొడుతున్నారనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.ప్రధాన అభ్యంతరాలు ఇవే..ప్రస్తుత ధరల పెరుగుదల దృష్ట్యా రూ.600 వేతనం పెంపు అనేది కనీసం పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోదు.
కేంద్రం తన వాటాను పెంచు కునేందుకు అంగీకరించినప్పుడు.. రాష్ట్రం తన వాటాగా మరికొంత అదనంగా కేటాయించి కనీసం 30శాతం నుంచి 50 శాతం వేతనం పెంపునకు ఎందుకు కృషి చేయడం లేదన్నది వారి ప్రశ్న. మొత్తం రూ.2,000 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదిస్తూ, అందులో ఉద్యోగుల వేతనాల కోసం నామమాత్రపు వాటా కేటాయించడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులైన క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లు, ఇతర సిబ్బందికి న్యాయమైన వేతన పెంపును ప్రతిపాదించాలని, ప్రభుత్వం – అధికారులు సమన్వయంతో పనిచేసి కనీసం 50 శాతం వేతనాలు పెంచేలా పీఏబీకి ప్రతిపాదనలు పంపాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నామమాత్రపు పెంపును అంగీకరించం తిరందాసు సంతోష్కుమార్, టీసీఆర్పీఏ రాష్ట్ర అధ్యక్షులు మేం ఈ నామమ్రాతమపు పెంపును అంగీకరించం. మా ప్రధాన డిమాండ్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ. ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో పనిచేసి పీఏబీ సమావేశంలో 50శాతం వేతన పెంపునకు ప్రతిపాదనలు పంపాలి.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.
దానికి సమయం పడుతుందనుకుంటే తక్షణమే మినిమం టైం స్కేల్ అమలు చేసి, కనీసం 50 శాతం వేతనాలను పెంచాలి.
మొగిలిచర్ల శ్రీనివాస్,
టీసీఆర్పీఏ రాష్ట్ర నాయకులు



