మూడు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై జైల్లో ఉన్న విద్యార్థి నేత ఉమర్ ఖలీద్కు శుక్రవారం ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ విషయంలో అతనికి గతంలో ట్రయల్ కోర్టులో చుక్కెదురు కాగా హైకోర్టులో తాజాగా ఊరట దక్కింది. జూన్ 1-3 తేదీల మధ్య మూడు రోజుల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా 2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఖలీద్పై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ ఏడాది సెప్టెంబర్లో అరెస్టైన నాటి నుంచీ జైల్లో ఉంటున్నాడు. తల్లి సర్జరీ ఉన్నందున ఆమెను చూసుకునేందుకు 15 రోజుల పాటు బెయిల్ కోరుతూ ఖలీద్ దాఖలు చేసిన పిటిషన్ను గతంలో ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు మాత్రం ఖలీద్కు స్వల్ప ఊరట కల్పిస్తూ మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కోర్టు ఉమర్ ఖలీద్కు పలు షరతులు విధించింది. బెయిల్పై విడుదలయ్యాక ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధి దాటి వెళ్లకూడదని స్పష్టం చేసింది. అధికారులకు ఇచ్చిన అడ్రస్లోనే ఉండాలని చెప్పింది. ఆస్పత్రి మినహా మరే ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. బెయిల్ సమయంలో ఒకే ఒక మొబైల్ నెంబర్ను వాడాలని కూడా షరతు విధించింది. ఢిల్లీ పోలీసులు మాత్రం ఉమర్ ఖలీద్కు బెయిల్ను వ్యతిరేకించారు. ఆయన తల్లిది సాధారణ శస్త్రచికిత్స అని పేర్కొన్నారు. పోలీసు భద్రత మధ్య తల్లిని చూసేందుకు ఖలీద్కు అనుమతిస్తే సరిపోతుందని చెప్పారు.
ఉమర్ ఖాలిద్కు ఊరట
- Advertisement -
- Advertisement -



