Saturday, May 23, 2026
E-PAPER
Homeక్రైమ్వడదెబ్బతో ఐదుగురు మృతి

వడదెబ్బతో ఐదుగురు మృతి

- Advertisement -

పిట్టల్లా రాలుతున్న 
కూలీలు, రైతులు
వడదెబ్బతో ఐదుగురు మృతి
పిట్టల్లా రాలుతున్న కూలీలు, రైతులు


నవతెలంగాణ-తిమ్మాపూర్‌ /కొనిజర్ల/ తుంగతుర్తి/ నేరడిగొండ / తలమడుగు

వెండ వేడి.. తీవ్రమైన వడగాడ్పుల వల్ల వడదెబ్బ ఘటనలు పెరుగుతున్నాయి. వివిధ పనులకు వెళ్లిన వారు వడదెబ్బకు గురై శుక్రవారం ఐదుగురు మృతిచెందారు. ఎక్కువగా ఉపాధి కూలీలు, హమాలీలు, రైతులు వడదెబ్బకు గురవుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన ఆరెల్లి పర్శరాములు(62) వరుసగా వ్యవసాయ పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో అస్వస్థతకు గురై రెండ్రోజులు చికిత్స పొందాడు. పరిస్థితి విషమించి గురువారం రాత్రి మృతిచెందాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రానికి చెందిన ఉపాధి కూలీ పాముల శ్రీను(45) శుక్రవారం ఉదయం పని చేస్తుండగా వాంతులు చేసుకుంటూ అక్కడే కుప్పకూలిపోయి ప్రాణం కోల్పోయాడు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సూరంపల్లి రామారావు అధికారులకు సమాచారం అందజేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన చర్లపల్లి సోమయ్య(69) రైతుసేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే వడదెబ్బకు గురై మృతిచెందినట్టు కుటుంబీకులు తెలిపారు.

ఎస్టీ హాస్టల్‌ ఉద్యోగిని మృతి
ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలంలోని బోరిగాం గ్రామానికి చెందిన జాదవ్‌ లతాబాయి(54) వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె ఉట్నూర్‌లోని ఎస్టీ హాస్టల్‌లో ప్రభుత్వ కామాటిగా విధులు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎండల తీవ్రత కారణంగా అస్వస్థతకు గురైన ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, సాయంత్రం చనిపోయారు. అంత్యక్రియలకు పలువురు ప్రజాప్రతినిధులు, ఐటీడీఏ ఉద్యోగులు హాజరై నివాళులర్పించారు. ఐటీడీఏ హెచ్‌డబ్ల్యూఓ కార్తీక్‌, రవి, రిటైర్డ్‌ ఈఈ భీంరావు ఆధ్వర్యంలో ఐటీడీఏ ఉద్యోగుల తరఫున రూ.30 వేల ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్‌ సజన్‌, సర్పంచ్‌ రాథోడ్‌ వినేష్‌ ఉన్నారు.
అలాగే, తలమడుగు మండలంలో రెండ్రోజు ల్లోనే ముగ్గురు వడదెబ్బతో మృతిచెందారు. దేవాపూర్‌ గ్రామానికి చెందిన పొచ్చన్న, భరంపూర్‌ గ్రామానికి చెందిన శంకరయ్య రెండ్రోజుల కిందట చనిపోయారు. శుక్రవారం కుచులాపూర్‌ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి ఆత్రం రాము(45) వడదెబ్బతో మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -