Tuesday, May 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిరాష్ట్ర ఖజానాకు మద్యమే మార్గమా?

రాష్ట్ర ఖజానాకు మద్యమే మార్గమా?

- Advertisement -


తెలంగాణ రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తున్న ప్రధాన వనరుల్లో మద్యం ఆదాయం అగ్రస్థానంలో నిలుస్తోంది. ఒకవైపు ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుండగా, మరోవైపు అదే మద్యం లక్షలాది కుటుంబాల జీవితాల్లో విషాదాన్ని నింపుతోంది. ప్రజల ఆరోగ్యం, కుటుంబ ఆర్థిక స్థితి, సామాజిక భద్రతలు దెబ్బతింటున్నా పాలక వ్యవస్థ మాత్రం మద్యం ద్వారా వచ్చే ఆదాయంపైనే అధికంగా ఆధారపడుతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
రాష్ట్రంలో మద్యం విక్రయాలు ప్రతి ఏడాది కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.44,557 కోట్లకు చేరింది. ఇందులో మద్యం అమ్మకాల ద్వారానే రూ.40,209 కోట్లు వచ్చాయి. వైన్స్ దుకాణాల దరఖాస్తు ఫీజుల రూపంలో రూ.2,869 కోట్లు, దుకాణ లైసెన్సుల ఫీజుల రూపంలో రూ.1,771 కోట్లు, బార్ల అనుమతులు, ఇతర మార్గాల ద్వారా రూ.549 కోట్లు ఖజానాకు చేరాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి సుమారు ఏడు శాతం ఆదాయం పెరగడం గమనార్హం.ఈ సంఖ్యలు ప్రభుత్వ ఆదాయ వృద్ధిని సూచిస్తున్న ప్పటికీ, మరో కోణంలో చూస్తే రాష్ట్రంలో మద్యం వినియోగం ఎంత తీవ్ర స్థాయికి చేరిందో స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వాలు మద్యం విక్రయాలను నియంత్రించాల్సిన పరిస్థితిలో ఉండగా, ఆదాయం కోసం వాటిని మరింత ప్రోత్సహిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే వస్తువులపై ఆధారపడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నడవడం ప్రమాదకర ధోరణిగా భావించాల్సిన అవసరం ఉంది.
మన రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఆ బాధ్యత నిర్లక్ష్యానికి గురవుతోందనే భావన కలుగు తోంది. మద్యానికి బానిసై అనేక పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా కూలి పోతున్నాయి. కష్టపడి సంపాదించిన డబ్బంతా మద్యం దుకాణాలకే చేరి పోవడంతో కుటుంబాల్లో నిత్యకలహాలు, అప్పులు, గృహహింసలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సామాజిక సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మద్యం వ్యసనం కేవలం వ్యక్తిని మాత్రమే కాదు, మొత్తం కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తోంది. తండ్రి మద్యానికి బానిసైతే పిల్లల చదువు దెబ్బతింటోంది. మహిళల భద్రత ప్రమాదంలో పడుతోంది. ఎన్నో కుటుంబాలు అప్పుల బారిన పడి వీధిన పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కల్తీ మద్యం, నాటుసారా విక్రయాలు ఇంకా పూర్తిగా ఆగకపోవడం మరో పెద్ద ప్రమాదం. ఈ సామాజిక విపత్తును అరికట్టా ల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం “ఆదాయం ఎంత వచ్చింది?” అనే కోణంలోనే సమీక్షలు నిర్వహించడం విచారకరం. మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి? ఎన్ని మంది ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు? ఎంతమంది యువత వ్యసనాల బారిన పడుతున్నారు? అనే అంశాలపై సమగ్ర చర్చలు జరగడం లేదు.
తెలంగాణ సమాజం ఆర్థికంగా, సామాజికంగా బలపడాలంటే ప్రభుత్వాలు మద్యం ఆదాయంపై ఆధారపడే ధోరణిని క్రమంగా తగ్గించాలి. అందుకోసం ఐటీ, ఫార్మా రంగాలతో పాటు పర్యాటకం, సేవారంగం, టెక్స్‌‌టైల్, హ్యాండ్లూమ్స్, ఆహార ప్రాసెసింగ్ వంటి ఉపాధి కల్పించే రంగాలను మరింత ప్రోత్సహించాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలి. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు పెంచాలి. పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెడితే ఉపాధితో పాటు దీర్ఘకాలిక ఆదాయం కూడా లభిస్తుంది.మద్యం నియంత్రణలో భాగంగా కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలి. గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ మద్యం తయారీని పూర్తిగా అరికట్టాలి. అదే సమయంలో ప్రజలను వ్యసనాల నుంచి దూరం చేసే అవగాహనా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలి. ప్రతి జిల్లాలో డీ–అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు ఉచిత వైద్యం, కౌన్సెలింగ్ అందించాలి. పాఠశాల స్థాయి నుంచే మద్యం దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి.
రాష్ట్ర ఖజానా నిండటం ఒక్కటే అభివృద్ధికి ప్రమాణం కాదు. ప్రజల ఇళ్లల్లో నవ్వులు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, భద్రత ఉండాలి. ప్రజల కన్నీళ్లపై నిర్మించిన ఆదాయం ఎప్పటికీ శాశ్వత వికాసాన్ని ఇవ్వదు. మద్యం ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయం కంటే, ఆరోగ్యవంతమైన సమాజం ఎంతో గొప్పది.ప్రభుత్వాలు ప్రజల బలహీనతలను ఆదాయ వనరులుగా కాకుండా, వారి శక్తిసామర్థ్యాలను అభివృద్ధి సాధనాలుగా చూడాలి. పాలకుల ఆలోచనా విధానం మారినప్పుడే నిజమైన సంక్షేమ రాజ్యం సాధ్యం.
మేకిరి దామోదర్, 9573666650.
-మేకిరి దామోదర్,
9573666650.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -