బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సాతాని శ్రీశైలం
నవతెలంగాణ – సదాశివపేట
సదాశివపేట పట్టణంలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సాతాని శ్రీశైలం మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి తమ పార్టీ విధానాలు, గత పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా సాతాని శ్రీశైలం మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు సుభిక్షంగా జీవించారని, సంక్షేమ పథకాలు నిరాటంకంగా అందాయని గుర్తుచేశారు. రైతులు, పేదలు, కార్మిక వర్గాల కోసం అమలుచేసిన అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు.
అదే సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలు ఆశించిన విధంగా ఒక్క పథకం కూడా సక్రమంగా అందడం లేదని, సంక్షేమం పేరుతో కేవలం బాకీ కార్డులు మాత్రమే చేతికి వస్తున్నాయన్నారు.
మున్సిపల్ స్థాయిలో అభివృద్ధి నిలిచిపోయిందని, సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పేదల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా 10వ వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి, కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని సాతాని శ్రీశైలం విజ్ఞప్తి చేశారు. తన గెలుపుతో వార్డు అభివృద్ధికి మరింత వేగం తీసుకువస్తానని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.



