గంజాయి మాఫియాపై కఠినంగా వ్యవహారించాలి : డీవైఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కానిస్టేబుల్ సౌమ్య మరణానికి కారకులైన గంజాయి మాఫియా నిందితులను కఠినంగా శిక్షించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్ మాట్లాడుతూ గంజాయి మాఫియా దాడులను అరికట్టాలనీ, అడ్డుకోబోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను తమ వాహనంతో తొక్కించి హత్య చేసిన డ్రగ్స్ నిందితులను కఠినంగా శిక్షించాలనీ, సౌమ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్, గంజాయి విక్రయాలను నిర్మూలించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులకే రక్షణ లేకపోతే ప్రజలను కాపాడేది ఎవరు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు, వాడకం విపరీతంగా పెరిగిందనీ, రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి బారినపడి వేలాదిమంది యువత ఆ మత్తులో ప్రజలపై దాడులు చేసేలా తయారవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి పెరుగుదల సమాజంలో అనేక అఘాయిత్యాలకు దారి తీస్తుందని తెలిపారు. మత్తులో ఉన్న యువత విచక్షణ కోల్పోయి హత్యలు చేస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. గంజాయి విక్రయాలు చేసే వారినీ, తీసుకునే వారిని గుర్తించి కఠిన శిక్షలు విధించాలనీ, విద్యా సంస్థల్లో వీటి విస్తరణకు నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు.
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టీ.నాగరాజు, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, బి.ప్రసాద్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితరులు నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. డ్రగ్స్, గంజాయిలను పూర్తిగా నివారించడంలో పోలీస్ శాఖ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఆ మాఫియా ఆగడాలు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రులు గంజాయి గ్యాంగులు నిత్యం దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. అనేక ఘటనలు జరుగుతున్నా, వందల కోట్ల రూపాయల డ్రగ్స్ గంజాయి వ్యాపారం జరుగుతున్నా, టన్నుల కొద్ది గంజాయి విక్రయాలు పట్టుబడుతున్నప్పటికీ వాటి నిర్మూలనలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. డ్రగ్స్పై యుద్ధం చేయాలనీ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన గంజాయి ఆగడాలు, దాడులు మాత్రం ఆగడం లేదని చెప్పారు. గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతున్న వారి నుండి ప్రజలకు రక్షణ కల్పించాలనీ, రాష్ట్రవ్యాప్తంగా కట్టు దిట్టమైన చర్యలు చేపట్టి ప్రజలకు, యువతకు ఎలాంటి హాని జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో యువజన సంఘం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలనకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ హైదరాబాద్ నగర కార్యదర్శి ఎండీ జావేద్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ నగర కార్యదర్శి అశోక్ రెడ్డి, అధ్యక్షులు లెనిన్ గువేరా, డీవైఎఫ్ఐ నగర నాయకులు రాజు, జ్యోతి, శ్రావ్య, ఎస్ఎఫ్ఐ నాయకులు రజనీకాంత్, ప్రవీణ్, ఆంజనేయులు, గోపి తదితరులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ సౌమ్య హంతకులను శిక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



