చర్లపల్లి జైలుకు తరలింపు
మూడు రోజుల పోలీసు విచారణ
హైదరాబాద్ : పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను పోలీసులు మూడో రోజు విచారణ చేశారు. పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్లో అతడిని పలు ప్రశ్నలు అడిగారు. శుక్రవారంతో భగీరథ్ మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో నిందితుడిని మల్కాజ్గిరి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలుకు తరలించారు.
ఇన్స్టా, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా
విచారణలో పోలీసులు ప్రధానంగా బాధితురాలితో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఇన్స్టాగ్రామ్, వాట్సప్, స్నాప్చాట్లలో చాటింగ్లకు సంబంధించిన వాటిపై ప్రశ్నించినట్టు సమాచారం. ఇందులో ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించారు. వాటి ఆధారంగానే బండి భగీరథ్ను లోతుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు అధికారి డీసీపీ రితిరాజ్, పేట్బషీరాబాద్ సీఐ విజయ్వర్ధన్ ఆధ్వర్యంలో(పోలీసు కస్టడీ) నిందితుడి పోలీసు విచారణను పూర్తి చేశారు.
విచారణలో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్
మే 16వ తేదీన పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ను పేట్బషీరాబాద్ పోలీసులు మే 27వ తేదీన చర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. మూడు రోజుల విచారణలో భాగంగా తొలిరోజు క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మొయినాబాద్లోని అనన్య ఫామ్ హౌస్కు తీసుకెళ్లారు. నిందితుడు అక్కడ తనను వేధించినట్లు బాధితురాలు ఫిర్యాదు పేర్కొన్న నేపథ్యంలో ఆ రోజు ఏం జరిగిందో వివరాలన్నీ తాజాగా భగీరథ్ నుంచి కూడా సేకరించారు. దాదాపు గంటపాటు ఫామ్హౌస్లో విచారణ చేసిన పోలీసులు కొన్ని కీలక వివరాలు రాబట్టారు. అనంతరం బాలానగర్లోని కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తీసుకు వెళ్లి విచారణ చేశారు.రెండోరోజు కూడా భగీరథ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ అంశాలపై ప్రశ్నించారు. బాధితురాలితో గతంలో చేసిన చాటింగ్ గురించి ప్రధానంగా ప్రశ్నించినట్టు సమాచారం. వాట్సప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్లో చేసిన చాటింగ్ గురించి ఆరా తీశారు. బాధితురాలు, ఆమె తల్లి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అనుబంధ ప్రశ్నలు వేశారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా పోలీసులు గతంలో బాధితురాలితో తిరిగిన ప్రదేశాల పుటేజ్, కాల్ డేటా ఆధారాలను సేకరించారు.



