జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
పీ.ఎం.శ్రీ నిధులను పాఠశాలలకు తప్పక వినియోగించు కోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మినీ మీటింగ్ హల్ లో పీఎం శ్రీ పాఠశాలల కు మంజూరైన నిధులను నిబంధనల మేరకు వినియోగించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హెడ్మాస్టర్లకు, ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో అన్నారు. పీఎం శ్రీ పథకం పరిధిలో ఉన్న పాఠశాలలలో యోగా, సైన్స్, గణిత ప్రయోగాలకు కావలసిన పరికరాల కొనుగోలు, విద్యార్థులకు విజ్ఞాన, పరిశ్రమల అవగాహన పర్యటనలు, కళలు–హస్తకళల వంటి సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాల నిర్వహణ కోసం మంజూరైన నిధులను వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లా లో పి.ఎం శ్రీ కింద 25 పాఠశాలలకు గ్రాంట్ లకు సంబంధించిన బిల్లులు ఆన్లైన్ లో సమర్పించాలని, ట్రెజరీ అధికారులు నిబంధనల మేరకు త్వరగా మంజూరు చేయాలని ఆదేశించారు.
పీఎం శ్రీ పాఠశాలల్లో అన్ని కార్యక్రమాలు నిర్ణీత కాలవ్యవధిలో సక్రమంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులతో నిరంతర సమన్వయం పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. జిల్లాలో ప్రి మెట్రిక్ ఉపకార వేతనాలకు తక్కువగా దరఖాస్తు చేసుకున్నారని, అర్హత గల వారు అందరినీ దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. త్వరలో పాఠశాలల వారీగా సమీక్షించడం జరుగుతుంది అని తెలియచేశారు.ప్రతీ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిని నోడల్ అధికారిగానియమించి,యుద్ధ ప్రాతిపదికన ఉపకార వేతనాల దరఖాస్తులు పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో ఏటిసిలుగా మార్చిన ఐటిఐ లలో వచ్చిన కొత్త కోర్సుల గురించి విద్యార్థులకు తెలియజేయాలని అన్నారు. మార్చి నెలలో దేశవ్యాప్తంగా 3 వ తరగతి విద్యార్థులకు జరిపే ఫౌండేషనల్ లర్నింగ్ స్టడీ మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి సత్యనారాయణ ట్రెజరీ అధికారి మోహన్,,అదనపు సాంఘిక సంక్షేమ అధికారి,మండల విద్యాధికారులు, పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.



