మాజీ మంత్రి హరీశ్రావు
ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో ప్రచారం
నవతెలంగాణ-గజ్వేల్ రూరల్
తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్.. బూతుల ప్రదాత రేవంత్రెడ్డి.. ముమ్మాటికీ తెలంగాణ జాతిపిత కేసీఆరే.. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి మాత్రం బూతు పితగా పేరు తెచ్చుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఇప్పటికే రెండు రైతుబంధులు ఎగ్గొట్టారని, ఇది మూడోది.. మొత్తం కలిపి ఒక్కసారే రైతుల అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కోడ్ అడ్డురాదు.. మేమే ఈసీకి లేఖ ఇస్తాం.. దమ్ముంటే 11లోగా రైతుబంధు వేయిస్తావా? అని రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. ఈ నెల 11లోగా రైతుబంధు వేయకపోతే కాంగ్రెస్ పార్టీని రైతులు చీల్చి చెండాడతారని తెలిపారు.
మనకు అన్నం పెట్టిన కేసీఆర్కి అండగా నిలవాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూడాలని, రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగట్టాలని ఓటర్లకు సూచించారు. గజ్వేల్లో 250 పడకల ఆస్పత్రి తెచ్చి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించింది కేసీఆర్ కదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టి కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మొద్దన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు అని.. మగోళ్లకు డబుల్ టికెట్ కొట్టి, ఆడవాళ్లకు తిప్పలు పెట్టే కార్యం ముందేసుకున్నారన్నారు. వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డా.యాదవ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.



