నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి జనసేన పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్లో సభ పెట్టుకునేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఆవతరణ నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వట్లేదని అధికారులు తెలియజేశారు. అయితే వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఆ పార్టీ నేతలు. సభ అనుమతి కోసం కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా సదురు పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నవనిర్మాణ్ పేరిట సభ నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. దీన్ని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాయి. గతంలో పవన్ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారంటూ విమర్శలు గుప్పించాయి. అలాంటి వ్యక్తికి తెలంగాణపై సభ పెట్టుకునే హక్కు లేదని ధ్వజమెత్తాయి. అధికార కాంగ్రెస్ శ్రేణులు సైతం పవన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు సభకు నిరాకరించినట్లు తెలుస్తోంది.


