నవతెలంగాణ-హైదరాబాద్: సీబీఎస్ఇ చీఫ్కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. ఓఎస్ఎం వ్యవస్థ అమలు, విద్యార్థులు నివేదించిన సమస్యలపై కమిటీ సభ్యులకు వివరించడానికి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్తో పాటు సిబిఎస్ఇ చీఫ్ రాహుల్ సింగ్ను పార్లమెంటరీ విద్యా స్థాయీ సంఘం ముందు హాజరుకావాలని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశించింది. సిబిఎస్ఇ 12వ తరగతిలో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) పద్ధతిపై వివాదం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది.
ఈ వివాదానికి సంబంధించిన సాంకేతిక, సైబర్ సెక్యూరిటీ కోణాలను పరిశీలించాల్సిందిగా కమిటీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) డైరెక్టర్ జనరల్కు సూచించింది. తమ సమాధాన పత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు లేవనెత్తిన ఆందోళనలను పరిశీలించడానికి విద్యాశాఖ నేడు ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. సాంకేతిక లోపాలు, మూల్యాంకనంలో వ్యత్యాసాలు, ఫలితాల అనంతరం ధ్రువీకరణ ప్రక్రియలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇందులో పాల్గొని, తమ సమస్యలు తెలియజేయడానికి విద్యార్థి ప్రతినిధులకు ప్యానల్ అవకాశం ఇచ్చింది. ఈ సమావేశంలోనే ఓఎస్ఎం వ్యవస్థపై కీలక విద్యాధికారుల నుంచి వివరణ కోరేందుకు చట్టసభ సభ్యులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు 9, 10 తరగతుల్లో సిబిఎస్సి త్రిభాషా సూత్రాన్ని అమలుచేయడం పైనా కాంగ్రెస్ ఎంపి దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ, విద్యారంగ భాగస్వాములు ఈ సమావేశంలో చర్చించనున్నారు.


