నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్తో చర్చలు నిలిచిపోయాయంటూ వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఇవి తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు. ఇరు దేశాల మధ్య సంప్రదింపులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, ఇటీవలి రోజుల్లో కూడా అవి చురుగ్గా జరిగాయని స్పష్టం చేశారు.
చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందన్న వాదనలు “తప్పుడు, నిరాధారమైనవి” అని ట్రంప్ అభివర్ణించారు. జూన్ 2వ తేదీన కూడా చర్చలు జరిగాయని తెలిపారు. “గత నాలుగు రోజులు, మూడు రోజులు, నిన్న, ఈరోజు… ఇలా ప్రతిరోజూ మా మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి,” అని ఆయన తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. చర్చల్లో పురోగతి ఉన్నప్పటికీ, తుది ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతోందని ఆయన అంగీకరించారు.
2025లో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలు, హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, లెబనాన్లో ఇజ్రాయెల్ కార్యకలాపాల వంటి అంశాలపై అసంతృప్తితో చర్చలు ఆగిపోయాయని ఇరాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల ఉపసంహరణ, హార్ముజ్ జలసంధిని నౌకా రవాణాకు పూర్తిగా తెరవడం వంటివి ఈ చర్చల్లో కీలక అంశాలుగా ఉన్నాయి.
గతంలో చర్చించడానికి ఇష్టపడని అణు అంశాలపై కూడా ఇరాన్ సుముఖత చూపిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. అయితే, ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదురుతుందన్న గ్యారెంటీ లేదని ఆయన హెచ్చరించారు.



