నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు టీవీ పరిశ్రమలో తనకంటూ మంచి పేరును సంపాదించుకున్న డాన్స్ మాస్టర్ పండు కారు ఉహించని ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం జిల్లాలో అర్ధరాత్రి వేళ ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పండు తీవ్రంగా గాయపడ్డారు. ఆనందపురం మండలం లోడగల వారి పాలెం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. హైవేపై అప్పటికే ఆగి ఉన్న రెండు వాహనాలను, అత్యంత వేగంగా వచ్చిన ఒక బొలెరో కోళ్ల వ్యాన్ బలంగా ఢీకొట్టింది.
ఈ భీకర ప్రమాదంలో డాన్స్ మాస్టర్ పండుకు సంబంధించిన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనతో పాటు వాహనంలో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి వేళ డ్రైవర్ నిద్రమత్తు, అలాగే వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద తీవ్రతను పరిశీలించి, ప్రమాదానికి గురైన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


