కర్నాటకతో రంజీ ట్రోఫీ క్వార్టర్ఫైనల్
ముంబయి : కర్నాటకతో రంజీ ట్రోఫీ క్వార్టర్ఫైనల్లో ముంబయి పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్లో 120 పరుగులకే కుప్పకూలిన ముంబయి.. బౌలర్లు రాణించటంతో కర్నాటకను సైతం తొలి ఇన్నింగ్స్లో 173 పరుగులకే ఆలౌట్ చేసింది. మయాంక్ అగర్వాల్ (92, 134 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) మెరిసినా.. దేవదత్ పడిక్కల్ (17), కరుణ్ నాయర్ (4), రవిచంద్రన్ స్మరణ్ (0), శ్రేయాస్ గోపాల్ (0), కెఎల్ రాహుల్ (28) నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్లో 47.1 ఓవర్లలోనే కర్నాటక కుప్పకూలింది. ముంబయి బౌలర్లు మోహిత్ అవస్థి (4/27), తుషార్ దేశ్పాండే (4/33) నాలుగేసి వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో కర్నాటక 53 పరుగుల ఆధిక్యం సాధించింది. ముంబయి రెండో ఇన్నింగ్స్లో 52 ఓవర్లలో 189/2 పరుగులతో ఆడుతోంది. ఆకాశ్ ఆనంద్ (53 నాటౌట్, 130 బంతుల్లో 4 ఫోర్లు), ముషీర్ ఖాన్ (49 నాటౌట్, 105 బంతుల్లో) అజేయంగా ఆడుతున్నారు.
యశస్వి జైస్వాల్ (36), అఖిల్ (33) మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేదు. రెండో రోజు ఆట ముగిసేసరికి, ముంబయి ప్రస్తుతం 136 పరుగుల ముందంజలో కొనసాగుతుంది.
బెంగాల్తో రంజీ ట్రోఫీ క్వార్టర్స్లో ఆంధ్ర ముందంజలో కొనసాగుతుంది. రికీ భుయ్ (83), షేక్ రషీద్ (46), నితీశ్ కుమార్ రెడ్డి (33), శ్రీకర్ భరత్ (47) రాణించటంతో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 88.4 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 63 ఓవర్లలో 199/5తో ఎదురీదుతోంది. సుదీప్ కుమార్ (112 నాటౌట్) అజేయ సెంచరీతో ఆడుతున్నాడు. బెంగాల్ ప్రస్తుతం 96 పరుగుల వెనుకంజలో నిలిచింది. మరో క్వార్టర్స్లో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులు చేయగా.. ఉత్తరాఖాండ్ 282/5 పరుగులు చేసి, 47 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతుంది. మరో క్వార్టర్స్ మ్యాచ్లో జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 194 పరుగులకు ఆలౌట్ కాగా.. మధ్యప్రదేశ్ 152 పరుగులకే కుప్పకూలింది. జమ్మూకశ్మీర్ రెండో ఇన్నింగ్స్లో 84/5తో ఆడుతోంది. జమ్మూకశ్మీర్ ప్రస్తుతం 126 పరుగుల ముందంజలో నిలిచింది.



