Sunday, February 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసాగర్‌ ఎడమ కాలువలో కారు బోల్తా

సాగర్‌ ఎడమ కాలువలో కారు బోల్తా

- Advertisement -

గల్లంతైన భార్యాభర్తలు
గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టిన పోలీసులు
నిడమనూరు మండలం ముకుందాపురం సాగర్‌ ఎడమ కాలువ వద్ద ఘటన


నవతెలంగాణ -నిడమనూరు
కారు అదుపు తప్పి సాగర్‌ ఎడమకాలువలో పడిపోవడంతో భార్యాభర్తలు గల్లంతయ్యారు. ఈ ఘటన శనివారం రాత్రి నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద జరిగింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం కంపసాగరం గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య(65) భార్య పద్మ(60)తో కలిసి శనివారం తమ సొంత వాహనంలో మిర్యాలగూడలోని కుమారుని వద్దకు వెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో కొడుకు తన స్నేహితున్ని ఇచ్చి పంపించాడు. ముకుందపురం వద్ద సాగర్‌ ఎడమ కాలువ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి ఎడమ కాలువలో పల్టీ కొట్టింది. అప్రమత్తమైన కారు డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చినప్పటికీ.. పుల్లయ్య, పద్మ నీటి ఉధృతికి కారులోనే కొట్టుకుపోయారు.

అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎడమ కాలువ నీటిని నిలిపివేసి గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. అయినా ఫలితం లేకపోవడంతో సీసీ కెమెరాలు సహాయంతో పరిశీలించారు. నెల కిందట మిర్యాలగూడ పరిధిలోని వెంకటాద్రిపాలెం వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పుల్లయ్య, పద్మకు రోడ్డు ప్రమాదం జరిగి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. కాగా వైద్య పరీక్ష నిమిత్తం శనివారం మిర్యాలగూడ వెళ్లి వస్తుండగా ఎడమ కాలువ పడటంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. పుల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు మిర్యాలగూడలో బిజినెస్‌ చేస్తున్నట్టు స్థానికులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -