8.6 శాతం ఉద్యోగులకు ఉద్వాసన
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) తయారీ సంస్థ అయిన హిందుస్తాన్ యూరిలీవర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) భారీగా ఉద్యోగుల కుదింపునకు పాల్పడింది. దేశంలో మందగించిన డిమాండ్ ఆ కంపెనీ ఉద్యోగుల భద్రతకు సెగ పెట్టినట్లు కథనాలు వస్తున్నాయి. అమ్మకాలు పడిపోవడంతో ఆర్థిక సంవత్సరం 2025-26లో తన పర్మనెంట్ ఉద్యోగులు, కార్మికుల సంఖ్యను తగ్గించుకుంది. డవ్ సబ్బు, సర్ఫ్ఎక్సల్ డిటర్జెంట్ వంటి ప్రముఖ బ్రాండ్లను తయారు చేసే ఈ సంస్థ మార్చి 31 నాటికి తన పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్యను అంతకుముందు ఏడాది కంటే 8.6 శాతం తగ్గించి 7,499 కి, అలాగే కార్మికుల సంఖ్యను 5.3 శాతం తగ్గించి 17,490 కి పరిమితం చేసింది. అయితే ఈ కాలంలో కంపెనీ 5 శాతం అమ్మకాల పెరుగుదలను నమోదు చేసింది. కాగా.. కంపెనీ నికర లాభాల్లో మెరుగుదల లేకుండా కొనసాగింది. అధిక ధరలతో దేశంలో ప్రజల ఆదాయాలు పడిపోవడంతో కార్పొరేట్ కంపెనీల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో లాభాల మార్జిన్లను కాపాడుకోవడానికి కంపెనీలు అంతర్గతంగా భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి సవాలుతో కూడిన మార్కెట్ పరిస్థితుల్లో విజయవంతంగా పనిచేయడానికి స్పష్టమైన పోర్ట్ఫోలియో ఎంపికలు, క్రమశిక్షణతో కూడిన మూలధన కేటాయింపులు, విలువ ఆధారిత ఆదాయ వృద్ధిపై దృష్టి పెట్టడమే తమ ప్రాధాన్యతని కంపెనీ ఎండి ప్రియా నాయర్ వార్షిక నివేదికలో పేర్కొన్నారు.
హెచ్యూఎల్కు మాంద్యం సెగ
- Advertisement -
- Advertisement -



