కేరళ ఎన్నికల ప్రచారంలో
కాంగ్రెస్ ఆరోపణలపై సీపీఐ(ఎం) డిమాండ్
న్యూఢిల్లీ : బీజేపీతో సీపీఐ(ఎం)కు అవగాహన వుందంటూ కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ లేఖ రాశారు. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్, ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) బ్లాక్ సమావేశం సోమవారం జరగనున్న నేపథ్యంలో ఈ లేఖ వెలువడింది. ఇండియా బ్లాక్లోని ఇతర భాగస్వామ్య పక్షాలకూ బేబీ ఈ లేఖను పంపించారు. కేరళలో సీపీఐ(ఎం)పై కాంగ్రెస్ నిలకడగా చేస్తూ వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఖర్గే సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు పదే పదే చేస్తున్న ఆరోపణలు ఎన్నికల శతృత్వాన్ని మించి వున్నాయని, బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనేందుకు ఏర్పడిన ప్రతిపక్ష కూటమి పునాదిని దెబ్బతీస్తున్నాయని బేబీ పేర్కొన్నారు. వామపక్షాలు, బీజేపీ ఒక రాజకీయ అవగాహనకు వచ్చాయని, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ప్రధాని మోడీతో ప్రత్యేక అవగాహన వుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారాన్ని నిర్వహించిందని బేబీ తెలిపారు. అటువంటి ఆరోపణలు, ఇండియా బ్లాక్కి మూలమైన సహకార స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని స్పష్టం చేశారు. బీజేపీని రాజకీయంగా ఎదుర్కొనేందుకు విస్తృత వేదికగా ఇండియా బ్లాక్ రూపొందిందని బేబీ తెలిపారు. సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రత్యర్ధులుగా వున్న పార్టీలను ఒకే తాటిపైకి తీసుకురావడం జరిగిందన్నారు. 2023లో ఈ కూటమి ఏర్పడిన నాటి నుంచి ప్రతిపక్షాల ఐక్యతను బలోపేతం చేసేందుకు సీపీఐ(ఎం) నిరంతరంగా కృషి చేస్తూ వచ్చిందన్నారు. ఒకపక్క కేరళలో బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ మరోపక్క జాతీయ స్థాయిలో సీపీఐ(ఎం)తో భాగస్వామిగా వుండలేదంటూ దీనిపై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించారు. ఇటువంటి ఆరోపణలను తేలికగా తీసుకోలేమని బేబీ స్పష్టం చేశారు. ఈ అంశం వల్ల ప్రతిపక్షాల సమైక్యతకు సంబంధించి తీవ్ర పర్యవసానాలు వుంటాయని హెచ్చరించారు. జూన్ 8న ఇండియా బ్లాక్ సమావేశానికి ముందుగానే ఈ విచ్ఛిన్నకర ఎత్తుగడలపై కాంగ్రెస్ నాయకత్వం తమ వైఖరిని స్పష్టం చేయాలని బేబీ డిమాండ్ చేశారు. ‘ ఈ అంశాలపై వివరణ ఇవ్వకపోతే, ఇండియా బ్లాక్ అసలైన ప్రయోజనమే సందిగ్ధంలో పడుతుంది.’ అని ఆయన పేర్కొన్నారు.
కేరళలో ఈడీ చర్యలపై కాంగ్రెస్-బీజేపీ బంధం!
ప్రతిపక్షాల సమన్వయానికి తమ పార్టీ కట్టుబడి వుందని సీపీఐ(ఎం) నేత పునరుద్ఘాటించారు. మోడీ ప్రభుత్వ నిరంకుశవాద, మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు పార్లమెంట్లో ఇండియా బ్లాక్ భాగస్వాములతో, ప్రతిపక్ష పార్టీలతో కలిసి తమ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. మోడీ ప్రభుత్వంపై తమ వ్యూహాన్ని చర్చించేందుకు, ప్రతిపక్షాల ఐక్యతను బలోపేతం చేసే ప్రయత్నాలను సమీక్షించేందుకు సోమవారం ఢిల్లీలో ఇండియా బ్లాక్ పార్టీల సీనియర్ నేతలు సమావేశం కానున్నారు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గేలు ఈ సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఈ సమావేశానికి తాము హాజరు కాబోమని డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. టీవీకేతో పొత్తు పెట్టుకోవాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని ద్రోహపూరితమైనదిగా డీఎంకే అభివర్ణించింది.
వివరణ ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



