నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్రంలోని మోడీ సర్కార్ యుద్ధం సాకుతో ఇంధన ధరలను క్రమక్రమంగా పెంచుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే విడుతల వారీగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, కమర్షియల్, డొమెస్టెక్ గ్యాస్ సిలిండర్ రేట్లలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఇంధన ఆధారిత రంగాలపై ఈ ధరల ఎఫెక్ట్ పడింది. నిత్యావసర ధరలు భగ్గుమంటుండగా ఇంధన ధరలను పెంచి సామాన్యుడి ఆదాయానికి గండికొడుతోంది మోడీ సర్కార్.
తాజాగా ఈ ధరల పెంపుపై కేంద్ర పెట్రోలియం, నేచరల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఆదివారం వింత ప్రకటన చేసింది. పొరుగు దేశాలతో పోలిస్తే భారతీయులు అతి తక్కువ ధరలకే గ్యాస్ కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలతో పాటు పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లోగ్యాస్ ధరలు అధికంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ పెంపు ప్రజలపై అంత భారం కాదని సమర్ధించుకుంది. ఈ ప్రకటనపై విపక్షాల నుంచి సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ధరలతో కాదు పోలిక.. పౌరులకు కల్పించే మౌలిక వసతులతో సరిచూసుకోవాలని హితువు పలుకుతున్నాయి.



