నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో విద్యా వ్యవస్థ తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో రేవంత్ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు తగ్గించాలని రేవంత్ ప్రభుత్వం యోచిస్తోందని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివలన పేద విద్యార్థులను, బాలికలను చదువుకు దూరం చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.7 వల్ల విద్యార్థులు నేరుగా ట్యూషన్ ఫీజులు చెల్లించాల్సి వస్తోందని.. మరోవైపు రూ. 11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని మండిపడ్డారు. ప్రైవేట్ కాలేజీల దోపిడీని అరికట్టేందుకు జీవో నెం.7ను వెంటనే రద్దు చేయాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విద్యా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు.
డిగ్రీ అడ్మిషన్లలో తీవ్ర గందరగోళం నెలకొందని, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, కమిషనరేట్ వేర్వేరు కోర్సులను సిఫార్సు చేస్తున్నాయని తెలిపారు. యూనివర్సిటీల అనుమతి లేని కోర్సుల్లో కూడా అడ్మిషన్లు సాగుతున్నాయని ఆరోపించారు. గురుకుల పాఠశాలల్లో దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు మరణించినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవడం దారుణమన్నారు.



